ఎదులాపురం,జనవరి30: వైద్యశాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో మాతాశిశు మరణాల నివారణకు కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆశ కార్యకర్తలకు సూచించారు. ఉట్నూర్ సెక్టార్ పరిధిలోని ఆశ కార్యకర్తలకు ప్రాథమిక ఆరోగ్య రక్షణపై ఇస్తున్న శిక్షణ కార్యక్రమం సోమవారం ముగిసింది. ముందుగా శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఆశ కార్యకర్తలు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. పీహెచ్సీ స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేసేది ఆశ కార్యకర్తలేనని చెప్పారు. గర్భిణులపూర్తి సమచారం సంబంధిత రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. హైరిస్క్ ఉన్న గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వీడియోకాన్ఫరెన్స్లో నేరుగా ఆశ కార్యకర్తలతో మాట్లాడుతారని చెప్పారు. అనంతరం డీఎంహెచ్వో నరేందర్ మాట్లాడారు. గర్భిణులతో రిమ్స్కు వచ్చే ఆశ కార్యకర్తలకు ప్రత్యేక గది ఏర్పాటు చేసి భోజనం వసతి కల్పిస్తామని చెప్పారు. కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు గర్భిణులకు ఇచ్చిన అనంతరం వారు తీసుకుంటున్నారా లేదా స్వయంగా పరిశీలించాలన్నారు.
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియెగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడి యా ప్రతినిధులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. మీడి యా ప్రతినిధుల ఎన్రోల్మెంట్, కంటి పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ, డేటా ఎంట్రీ, తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. 33 బృందాల ద్వారా జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు బఫర్ టీమ్లు ముఖ్య ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నాయని వివరించారు. కలెక్టరేట్, బెటాలియన్లలో ఇప్పటికే శిబిరాలు నిర్వహించామని చెప్పారు. అనంతరం కంటి వెలుగు కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. డేటా ఎంట్రీ నమోదు తీరు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల్లో పీవోడీటీటీ డాక్టర్ కే మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్వోలు సాధన, మనోహర్, జిల్లా క్షయ నివారణ అధికారి శ్రీకాంత్, డీఎంవో ఎం శ్రీకాంత్, డీపీఆర్వో ఎన్ భీమ్ కుమార్, ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి విజయసారథి, శిక్షకురాలు లక్ష్మి, డీపీహెచ్ఎన్ శ్యామల, ఎంపీహెచ్ఎస్ సుశీల, మాస్మీడియాఅధికారి వెంకట్ రెడ్డి, ఎస్వో బ్రహ్మానందరెడ్డి, ప్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఉన్నారు.