ఖానాపూర్, మే 23 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఇక్బాల్పూర్లో శుక్రవారం అర్ధరాత్రి రైతులు ఆందోళన నిర్వహించారు. ధాన్యం బస్తాలను తరలించడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని నిర్మల్-మంచిర్యాల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచి, ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. గంటకు పైగా రాస్తారోకో చేస్తున్న ప్రదేశానికి ఖానాపూర్ ఎస్ఐ రహూల్ గైక్వాడ్ చేరుకొని రైతులతో మాట్లాడారు. తహసీల్దార్ సుజాతరెడ్డితో రైతులను ఫోన్లో మాట్లాడించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. అధికారులు లారీలను ఏర్పాటు చేసి, కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం బస్తాలను తరలించాలని డిమాండ్ చేశారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రాత్రి వేళ వర్షం కురిస్తే ధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం తరలింపుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కుంటాల, మే 23 : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అందకూర్లోని కల్లూరు ప్రధాన రోడ్డుపై కాంటా వేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీలను అధికారులు పంపించడం లేదని రైతులు రాస్తారోకో నిర్వహించారు. దాదాపు 100 మందికిపైగా రైతులు శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రోడ్డుపై భైఠాయించారు. దాదాపు 4 గంటలపాటు ఆందోళన కొనసాగగా.. రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై అశోక్ రైతులతో మాట్లాడారు. కలెక్టర్ వచ్చే వరకు కదిలేది లేదని పట్టుబట్టారు. చివరకు తహసీల్దార్ తగినన్ని లారీలు తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. మొక్కజొన్నతోపాటు జొన్న, ధాన్యం కాంటా వేయడానికి సిద్ధంగా ఉన్నాయని, అకాల వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. వెంట వెంటనే లారీలు పంపిస్తూ ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు.