నిర్మల్ అర్బన్, నవంబర్ 24 : జిల్లాలో వ్యాపారులు ఎలాంటి లైసెన్స్లు లేకుండానే ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. వీటికి సంబంధించి ఎలాంటి విక్రయాలు నిర్వహించాలన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు జారీ చేసిన లైసెన్స్లు ఉండాలి. కానీ జిల్లాలో నిబంధనలు పాటించకుండానే రోజుకు లక్షలాది వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, నిర్మల్, భైంసాతో పాటు మండల కేంద్రాల్లో పెద్ద మొత్తంలో వ్యాపార సముదాయాలు ఉన్నాయి.
దుకాణ సముదాయాలతో పాటు హోటళ్లు, స్వీట్ దుకాణాలు, ఫుట్ పాత్లపై విక్రయించే తినుబండారాలతో పాటు పాన్ షాపు దారులు ఇలా ప్రతి ఒక్కరూ ఫుడ్ సేఫ్టీ అధికారులు నుంచి లైసెన్స్లు తీసుకొని విక్రయాలు చేపట్టాల్సి ఉంటుంది. జిల్లాలో వ్యాపారులు ఎక్కడా ఇలాంటి నిబంధనలు పాటించడం లేదు. ఇతర జిల్లాలలోని ఆయా ఆహార పదార్థాల కంపెనీల లేబుళ్లను వాడుతూ జిల్లాలో కొందరు వ్యాపారం నిర్వహిస్తున్నారు. జన సంచారం లేని ప్రదేశాలు, శివారు ప్రాంతాల్లో వీరి వ్యాపారం ఎక్కువగా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిర్మల్, భైంసా, ఖానాపూర్లో దాదాపు 700-800 వరకు మాత్రమే ఫుడ్ లైసెన్స్లు ఉన్నట్లు సమాచారం. జిల్లాలో ఫుడ్ వ్యాపారం నిర్వహించే సముదాయాలు దాదాపు 2000 వరకు అనధికారికంగా ఉన్నాయి. కేవలం 800 మంది లైసెన్స్ హోల్డర్లు ఉండగా మిగతా 1200 మంది ఎలాంటి లైసెన్స్లు లేకుండానే తమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు చెల్లించకుండా ఆదాయానికి గండి కొడుతున్నారు. ఏడాది పాటు విక్రయాలు నిర్వహించుకోవాలని నాణ్యమైన వస్తువులను మాత్రమే ప్రజలకు విక్రయించాలని అధికారులు వీరికి లైసెన్స్లు జారీ చేస్తారు. ఏడాది గడువు ముగిసే సరికి నెల ముందుగానే లైసెన్స్ను వ్యాపారులు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది.
లేకపోతే కొత్త లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారులు లైసెన్స్ తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో పాటు రెన్యూవల్ చేసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. వీరి వ్యాపారంపై నిఘా ఉంచాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో శుక్రవారం ఫుడ్ లైసెన్స్ మేళా, శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అధికారులు ఫుడ్లైసెన్స్ మేళా నిర్వహించనున్నారు. వ్యాపారులకు అక్కడే లైసెన్స్లు జారీ చేయనున్నారు.
వ్యాపారం నిర్వహించే వారు లైసెన్స్ తీసుకోవాలనే నిబంధన ఉంది. లైసెన్స్లు లేకుండా వ్యాపారం చేస్తే వారికి ఆరు నెలల జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి.తమ లైసెన్స్ పరిధి ఏ ప్రాంతంలో ఉంటే అక్కడే వ్యాపారం నిర్వహించుకోవాలి.
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండు రోజుల పాటు అధికారులు ఫుడ్ లైసెన్స్ మేళాను నిర్వహించనున్నారు. ఆధార్, ఓటర్ ఐడీ కార్డుతో పాటు రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, జీఎస్టీ కాపీ, కరెంట్ బిల్, గ్రామ పంచాయతీ లైసెన్స్ కాపీతో ఫుడ్లైసెన్స్ మేళాకు వచ్చిన వ్యాపారులకు అక్కడే లైసెన్స్లు జారీ చేయనున్నారు.ఈ అవకాశాన్ని నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
జిల్లాలో లైసెన్స్ లేకుండా ఎవరూ విక్రయాలు చేపట్టవద్దు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మార్గ్ బజాజ్ ఎలక్ట్రానిక్ దుకాణం పక్కన గల ఎల్కే ఇన్ లో ఉదయం 10 గంటలకు ఫుడ్ లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నాం. వ్యాపారులందరూ ఈ లైసెన్స్ మేళా సద్వినియోగం చేసుకోవాలి.
-ప్రత్యూష, జిల్లా ఇన్చార్జి ఫుడ్ సేఫ్టీ అధికారి, నిర్మల్