సింగరేణిని ప్రైవేటీకరణ చేయం. అయినా మా చేతిలో ఏమున్నది? సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం వాటా 51 శాతం. కేంద్రానికి ఉన్నది 49 శాతమే. ఏం చేయాలనుకొన్నా రాష్ట్రం చేతిలోనే ఉంటుంది.
..గత నెల 12న రామగుండం పర్యటన సందర్భంగా మోదీ పచ్చి అబద్ధాలు ఇవి. నెల రోజులు తిరగకుండానే కేంద్రం దొంగదెబ్బ కొట్టింది. సింగరేణి ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా 4 బొగ్గు బ్లాకుల వేలానికి సిద్ధం కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
తెలంగాణ వెలుగుల మణిహారం సింగరేణిని నిర్వీర్యం చేసే ప్రధాని మోదీ కుట్రలపై నల్లనేల భగ్గుమన్నది. ప్రైవేటీకరణ చేయబోమంటూ రామగుండంలో మాయమాటలు చెప్పి, నెల తిరక్కుండానే దొంగదెబ కొట్టడంపై శనివారం అట్టుడికిపోయింది. సింగరేణి పరిధిలో నాలుగు బొగ్గు బ్లాకులను సంస్థకు కేటాయించకుండా వేలం వేసేందుకు సిద్ధం కావడంపై కార్మికలోకం మండిపడుతున్నది. టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకత్వంతో కలిసి రోడ్డెక్కింది. ఎక్కడికక్కడ ప్రధాని మోదీ దిష్టిబొమ్మలు దహనం చేసి, నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. లేదంటే మరో పోరాటం తప్పదని హెచ్చరించింది.
మంచిర్యాల ప్రతినిధి(నమస్తే తెలంగాణ)/గోదావరిఖని, డిసెంబర్ 3: రాష్ట్రంలోని భూగర్భ గనుల్లో అన్ని చోట్ల దాదాపు బొగ్గు నిల్వలు పూర్తయి, వాటిలో అనుకూలంగా ఉన్న వాటిని ఓపెన్కాస్టుగా మార్చేదిశగా సింగరేణి అడుగులు వేస్తున్నది. ఇప్పుడున్న పరిస్థితిలో మరో 20 ఏండ్ల వరకే మనుగడ సాగించే అవకాశమున్నది. కొత్త బ్లాకులను అందుబాటులోకి తెస్తే సంస్థకు మరో 50 ఏళ్ల భవిష్యత్తు ఉంటుంది. బొగ్గు ఉత్పత్తికి ఎలాంటి ఢోకా లేని పరిస్థితి ఉంటుంది. కానీ, కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం సింగరేణిని బొందపెట్టే కుట్రలు పన్నుతున్నది.
బొగ్గు బ్లాకులను ఒక్కొక్కటిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తూ, ఆ సంస్థ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. తాజాగా దేశవ్యాప్తంగా 141 బొగ్గు బ్లాకులను వేలానికి పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. శనివారం ఏకంగా బెంగళూర్లో ఇన్వెస్టర్ల సమావేశం నిర్వహించి, వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. అందులో సింగరేణికి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులు (కల్యాణ్ఖని బ్లాక్-6, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణ్పల్లి, పెనగడప) ఉండగా, బొగ్గు గని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు భగ్గుమన్నారు. మోదీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శించారని మండిపడుతున్నారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమని చెప్పిన మోదీ, బొగ్గు బ్లాకుల అంశంపై మాట్లాడకుండా రామగుండం పర్యటనలో మాయమాటలు చెప్పారని ఆగ్రహిస్తున్నారు. దీనిని ప్రైవేటీకరణ అనకుండా ఇంకేం అంటారని? ప్రశ్నిస్తున్నారు. బొగ్గు బ్లాకులను వేలం వేస్తే సింగరేణి ఏం చేయాలని నిలదీస్తున్నారు.
వేలాన్ని ఉపసంహరించుకోవాలి
దేశ వ్యాప్తంగా 141 బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు కేంద్రం సిద్ధం కావడం సరైందికాదు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వరంగంలో ఉన్న బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే దిశగా మోదీ ప్రయత్నాలు చేస్తున్నడు. దశలవారీగా బొగ్గు బ్లాకుల వేలం పాట నిర్వహిస్తున్నడు. గత నెలలో గోదావరిఖనికి వచ్చినప్పుడు సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని చెప్పిండు. ఇంతలోనే సింగరేణికి సంబంధించిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు సిద్ధమైండు. కేంద్రప్రభుత్వ వైఖరిని సీఐటీయూ ఖండిస్తున్నది. వేలం వేసే చర్యలను ఉపసంహరించుకోవాలి. లేకుంటే ఆందోళనలు, ధర్నాలు తప్పవు. అవసరమైతే సమ్మె చేయడానికైనా వెనుకాడం. – తుమ్మల రాజారెడ్డి, సీఐటీయూ అధ్యక్షుడు
వేలాన్ని వెనక్కి తీసుకోకుంటే సమ్మె తప్పదు
మోదీ అబద్ధాల కోరు. ఆయన రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నడు. పోయిన నెల 12న గోదావరిఖనికి వచ్చినప్పుడు సింగరేణిని ప్రైవేటీకరణ చేయనని చెప్పిండు. సింగరేణిలో 51 శాతం వాటా తెలంగాణకు ఉందని, తాను సింగరేణిని ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తానంటూ బోగస్ మాటలు చెప్పిండు. అప్పుడు బీఎంఎస్ నాయకులు మోదీ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసిన్రు. ఇప్పుడేమో సింగరేణికి సంబంధించిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు సిద్ధమైన్రు. రామగుండం బహిరంగసభలో మోదీ మాట్లాడిన మాటకు అర్థం ఏంటి? బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం, వేలం వేయడం అంటే ప్రైవేటీకరణ కాదా..? దీనికి మోదీ సమాధానం చెప్పాలి. కోలిండియాలో పరిస్థితులు, సింగరేణిలో పరిస్థితులకు చాలా తేడా ఉన్నది. కోలిండియాలో పెద్ద మొత్తంలో ఉన్న బొగ్గు నిల్వలను వెలికితీసే నైపుణ్యం, సత్తా, కార్మికులు లేరు. కానీ, సింగరేణి విషయానికి వస్తే సత్తాతో పాటు మంచి నైపుణ్యం, పని విధానం ఉన్నది. ఎలాంటి బ్లాకులనైనా తీసే సత్తా ఉన్న సింగరేణికి కొత్త బ్లాకులను ఇవ్వకుండా అమ్మడం ఎందుకో సమాధానం చెప్పాలి. తమకు అనుకూలమైన వారికి బొగ్గు బ్లాకులను ఇచ్చి, వారిచ్చే నజరానాలను వచ్చే ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేసి అధికారం కాపాడుకోవడానికి మోదీ ఇలా చేస్తున్నడు. సింగరేణి బొగ్గు బ్లాకులను వేలాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే. లేకుంటే సింగరేణిలో సమ్మె చేయడానికైనా వెనుకాడేది లేదు.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి
ఆందోళనలు తప్పవు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కార్మికులకు అశనిపాతంగా మారుతున్నయి. మోదీ సింగరేణిలో ప్రైవేటీకరణ ఉండదని చెబుతూనే మరోవైపు నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నడు. ప్రైవేట్ వ్యక్తులకు బొగ్గు బ్లాకులను కేటాయించడం ద్వారా సింగరేణిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నడు. సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను ఆ సంస్థకే కేటాయించేలా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ, వేలంలో పెట్టడం ఏ మాత్రం సరికాదు. ఈ నిర్ణయాన్ని మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నం. సింగరేణి ఇతర రాష్ర్టాల్లో బొగ్గు బ్లాకులను స్వాధీనం చేసుకొని పనిచేస్తున్నది. కానీ, తెలంగాణలో చేయలేదా..? కేంద్రం ప్రైవేటీకరణ దిశలోనే బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నది. సింగరేణి సంస్థలో ఇప్పటికే బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించి అనేక ఆందోళనలు చేసినం. వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు తీవ్రం చేస్తం.
– రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి