తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచ్చలాపూర్ గ్రామంలో విద్యుత్ ప్రమాదం ( Electricity Incident ) తో ఆదివారం ట్రాక్టర్ దహనం ( Tractor Gutted ) అయ్యింది. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన విద్యుత్ అధికారులను గ్రామస్థులు నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామంలో వేలాడే కరెంట్ తీగలు, వంగిన స్తంభాల కారణంగానే ప్రమాదం సంభవించిందని, పేద రైతు ట్రాక్టర్ దహనమైందని ఆరోపించారు. విద్యుత్ శాఖ ఏఈ జాన్, లైన్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, జూనియర్ లైన్మెన్ మహదేవ్ను మూడు గంటల పాటు అడ్డగించి పరిహారం కోసం డిమాండ్ చేశారు. గ్రామంలో దాదాపుగా 15 దారుల్లో విద్యుత్ తీగలు వేలాడుతూ వాహనాలకు, ఎడ్ల బండ్లకు కూడా తాకే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
మరమ్మతులు చేపట్టాలని కొన్ని నెలలుగా చెబుతున్నప్పటికీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తాండూర్ ఎస్సై కే ప్రసాద్ అక్కడకు చేరుకుని అటు స్థానికులతో, ఇటు అధికారితో మాట్లాడారు. రెండు, మూడు నెలల్లో ట్రాక్టర్ యజమానికి పరిహారం ఇప్పించడానికి ప్రతిపాదనలు పంపిస్తామని డీఈఈ ఫోన్లో చెప్పడంతో స్థానికులు శాంతించారు.
ఈ వర్షాకాలం ప్రారంభానికి ముందే గ్రామంలో విద్యుత్ లైన్ల పూర్తి స్థాయి మరమత్తులు పూర్తి చేసి ప్రమాధాలు జరగకుండా చూడాలని కోరారు. అచ్చలాపూర్ ఉప సర్పంచ్ గట్టు సంతోష్ కుమార్, నాయకులు మారిశెట్టి శ్రీనివాస్, కొండ సాయి, మాజీ ఉప సర్పంచ్ అడువాల సత్యనారాయణ పాల్గొన్నారు.