నిర్మల్, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాలోని చారిత్రక దేవాలయాలు, ప్రకృతి, సహజ సంపదను లక్ష్యంగా చేసుకొని టూరిజం కారిడార్ ఏర్పాటు చేసే దిశగా కసరత్తు జరుగుతున్నది. చదువుల తల్లి కొలువుదీరిన బాసర పుణ్యక్షేత్రం నుంచి మొదలుకొ ని కవ్వాల్ అభయారణ్యం వరకు ఈ కారిడార్ రూట్మ్యాప్ను అధికారులు సిద్ధం చేశారు. అలాగే కడెం ప్రాజెక్టుతో పాటు కుంటాల, పొచ్చెర జలపాతాలను కూడా లింకప్ చేస్తున్నారు. ఇప్పటికే బాసర దేవాలయ అభివృద్ధికి రూ.50 కోట్లతో ప్రత్యేక మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తున్నారు.
అలాగే కవ్వాల్ అభయారణ్యాన్ని కూడా ప్ర ధాన పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు అటవీశాఖ నిధులు మం జూరు చేసింది. మరోవైపు కడెం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు కూ డా కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కూడా జిల్లాలోని టూరిజం ప్రాంతాలను సందర్శింపజేసేందుకు ప్రతి వారం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఓ బస్సును నడుపుతున్నది. అయితే ఈ టూరిజం కారిడార్ ను సందర్శించేందుకు వచ్చే పర్యాటకుల కోసం విశ్రాంతితో పాటు వసతి, భోజన సదుపాయం కల్పించేందుకు గాను నిర్మల్లో టూ రిజం శాఖ హరిత హోటల్ను నిర్మించతలపెట్టింది. కడెం ప్రాజెక్టును సందర్శించే వారి కోసం ఇప్పటికే అక్కడ హరిత రిసార్ట్స్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి జిల్లా చారిత్రక సంపద సంరక్షణపైనే కాకుండా పర్యాటకంగా సొబగులు అద్దేందుకు కృషి చేస్తున్నారు.
అలాగే జిల్లాలో దాదాపు రూ.100 కోట్లతో 600కు పైగా దేవాలయాలను నిర్మింపజేశారు. ఇందులో భాగంగానే ఈ ప్రదేశాలన్నింటినీ కలుపుతూ జిల్లాలో టూరిజం కారిడార్ను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. జిల్లాలోని చారిత్రక, ప్రకృతి రమణీయ దృశ్యాలను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు ప్ర త్యేక రీతిలో ఆతిథ్యాన్ని అందించేందుకు కొత్తగా హరిత హోటల్ను నిర్మించ తలపెట్టారు. ప్రస్తుత రోడ్లు భవనాల శాఖ ఐబీని తొలగించి, ఆ స్థలంలో హరిత హోటల్ను నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.12 కోట్లతో పర్యాటక శాఖ ప్రతిపాదనలు కూడా రూపొందించింది. కాగా ఇటీవల ఆర్అండ్బీ శాఖ తన పరిధిలోని ఐబీని టూరి జం శాఖకు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నిర్మల్లో హరిత హోటల్ నిర్మాణం పూర్తయితే నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే వారికి ఎంతో సౌకర్యంగా ఉం టుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలోని ప్రకృతి సోయగాలు, పుణ్య క్షేత్రాలను తిలకించేందుకు పర్యాటకులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. స్వరాష్ట్రం లో ప్రభుత్వం పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యమున్న ప్రాంతాల కు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నది. దీంతో మౌళిక వసతులు, అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. బాసర స రస్వతీ ఆలయం, కవ్వాల్ అభయారణ్యం, కడెం ప్రాజెక్ట్, కుం టాల, పొచ్చెర జలపాతాలను చూసేందుకు పర్యాటకులు వస్తుంటా రు. ఆయా పర్యాటక ప్రాంతాలన్నింటికీ నిర్మల్ కేంద్రబిందువుగా మారింది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు, భక్తుల కోసం నిర్మల్లో హరిత హోటల్ నిర్మించబోతున్నాం. త్వరలోనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటాం.
-అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర మంత్రి