వసతులు, సేవలకు మెచ్చిన కేంద్ర బృందం
94 శాతం మార్కులతో క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫికెట్
‘లక్ష్యం’ నెరవేర్చిన ప్రసూతి దవాఖాన
నాణ్యమైన వైద్య సేవలకు దక్కిన ఫలితం
నిర్మల్ చైన్ గేట్, జూన్ 23 : ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ప్రత్యేకించి మాతా శిశు సంరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నది. దాంతో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు మెరుగయ్యాయి. ఈ నేపథ్యంలో సర్కారు దవాఖానలు ప్రైవేటుకు దీటుగా ఓపీ నమోదు చేస్తుండగా.. ఇటీవల నిర్మల్ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర బృందం ఆయా విభాగాల్లో 94శాతం మార్కులు కేటాయించింది.
క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫికెట్..
జిల్లా ప్రధాన దవాఖాన, మాతా శిశు సంక్షేమ దవాఖానను మే 10 నుంచి 12 వరకు జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల బృందం సందర్శించింది. కేంద్ర బృందంలో డా.జ్యోత్స్నా అగర్వాల్, డా. సరోజ్బాల, డా.ప్రశాంత్ సత్యదేవ్ కాప్సె తదితరులు మూడ్రోజుల పాటు ప్రధాన దవాఖాన, మాత శిశు సంరక్షణ దవాఖానలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు, పరిశుభ్రత, తదితర అంశాలపై స్వయంగా ఆరా తీశారు. రోగులు, ఐసీయూ వార్డు, రక్తపరీక్షల గది, శస్త్ర చికిత్సల గదితో పాటు పలు వార్డులను సందర్శించారు. ప్రభుత్వ పథకాల అమలు, రికార్డులు, పరిశుభ్రత తదితర అంశాలను నేరుగా పరిశీలించారు. రోగులకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు తదితర 17 అంశాల్లో 90కి పైగా మార్కులు, అన్ని అంశాల్లో 94 శాతం మార్కులు కేటాయించారు. ఈ నివేదిక ఆధారంగా జాతీయ క్వాలిటీ అస్యూరెన్సు సర్టిఫికెట్కు ఎంపిక చేశారు.
ప్రసూతి దవాఖానకు ‘లక్ష్య’..
నిర్మల్ ప్రసూతి దవాఖాన లక్ష్య ధ్రువీకరణ పత్రానికి ఎంపికైంది. దవాఖానను పరిశీలించిన కేంద్ర బృందం లేబర్ రూం నిర్వహణకు 92శాతం మార్కులు, ప్రసూతి వార్డుకు 91 శాతం మార్కులు ఇవ్వడంతో లక్ష్య ధ్రువీకరణ పత్రానికి ఎంపికైంది.
ఎన్క్యాష్తో మూడేండ్లు పారితోషికం..
దవాఖాన ఎన్క్వాష్కు ఎంపికైతే మూడేండ్లపాటు పారితోషికం అందుతుంది. ఒక పడకకు ఏడాదికి రూ.10 వేల చొప్పున అందిస్తారు. ప్రసూతి దవాఖానలో 50 పడకలు, జిల్లా దవాఖానలో 100 పడకలు ఉన్నాయి. రెండు ఆసుపత్రులకు కలిపి రూ.15లక్షలు అందనున్నాయి.
మంత్రి అల్లోల, కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ..
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలోని దవాఖానల అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి కేటాయించారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ పారూఖీ, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి తరచూ సందర్శించడంతో పాటు వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. రోగులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించారు. జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర ఇతర ప్రాంతాలనుంచి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపత్యంలో సాధారణ చికిత్సలతో పాటు ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
బాధ్యత మరింత పెరిగింది…
జిల్లా కేంద్రంలోని ప్రధాన, ప్రసూతి దవాఖానలు ఎన్క్యాష్ సర్టిఫికెట్కు ఎంపిక కావడం హర్షణీయం. ఇదే స్ఫూర్తితో రోగులకు మరింత సేవలు అందేలా కృషి చేస్తాం. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆస్పత్రి అభివృద్ధికి నిధులు కేటాయించారు. జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్పర్సన్ ఆస్పత్రిని తరచూ సందర్శించి సేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది సమష్టి సహకారంతోనే జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది.
– డా.దేవేందర్రెడ్డి, సూపరింటెండెంట్, జిల్లా ప్రధాన దవాఖాన