చెన్నూర్ టౌన్/హాజీపూర్, ఆగస్టు 30 : అమ్మలోని ప్రేమను, నాన్నలోని బాధ్యతను స్వీకరించే సోదరుడికి సోదరి కట్టే కంకణమే రక్షాబంధన్. ప్రతి శ్రావణ పౌర్ణమిన తోడబుట్టిన వాళ్లకు రాఖీ కట్టి, తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కాచెల్లెళంతా కోరుకుంటారు. తమ అన్న, తమ్ముడి నోరు తీపి చేసి వారంతా జీవితాంతం సుఖ, సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తారు. ఇలా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ నడుమ అనురాగ బంధానికి రాఖీ పండుగ ఒక వారధిలా నిలుస్తున్నది. ఈ సంవత్సరం ఆగస్టు 30న రాఖీ పౌర్ణమితో పాటు జంధ్యాల పౌర్ణమి నిర్వహించాలని పండితులు పేర్కొంటున్నారు.
రాఖీ పండుగ రోజున అక్కా చెల్లెళ్లు తప్పనిసరిగా మెట్టినింటి నుంచి పుట్టింటికి చేరుతారు. అన్నదమ్ములకు రాఖీలు కట్టి, స్వీట్లు తినిపిస్తారు. సోదరులు తమకు తోచినంత అక్కా చెల్లెళ్లకు కట్నం పెడతారు. ఎంత ఇచ్చినా అదే మహద్భాగ్యంగా స్వీకరించే అడపడుచులు, అంతకు లక్షల రెట్ల విలువైన ఆశీర్వచనాలు ఇస్తారు. అన్నదమ్ములతో తమ కష్టసుఖాలు చెప్పుకొని స్వాంతన పొందుతారు. ‘అన్నదమ్ములున్న బలం వేరే ఉంటది’ అని సోదరులు లేని స్త్రీలు తరచూ అనడం వింటుంటాం.
ఏడాదికి వచ్చే ద్వాదాశ పౌర్ణమిల్లో శ్రావణ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. సాధారణంగా జంధ్యాన్ని ధరించే వారు ఈ రోజునే పాతది వదిలి కొత్తదానిని ధరిస్తారు. దీనినే ఉపాకర్మ అంటరు. ఉపాకర్మను యజ్ఞోపవీతం పేరుతో పిలుస్తారు. వేదాధ్యయానికి ప్రతీకైన ఉపాకర్మను ఆచరించాలి. దీనికి ముందు ఉపనయనం జరిపించి జంధ్యాన్ని వేయడం ఆచారం. ఉపనయనం సమయంలో యజ్ఞోపవీతానికి జింకచర్మం కడతారు. దీనిని ఉపాక ర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు వదిలిపెడతారు. ఉపనయనం అయినవారు జంధ్యాల పౌర్ణమి రోజున గాయత్రీ పూ జ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది విసర్జించాలి. అవివాహితులు మూడు పోగుల జంధ్యాన్ని, వివాహమైన వారు మూడు బ్రహ్మ ముడులున్న 9 పోగుల జంధ్యాన్ని ధరిస్తారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా మంచిర్యాలలోని ప్రధాన మార్కెట్ రాఖీలు కొనుగోలు చేసే వారితో కిటకిటలాడింది. మరోవైపు మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్, బెల్లంపల్లి చౌరస్తా, ఐబీ చౌరస్తా, ైప్లె ఓవర్ బ్రిడ్జి వద్ద ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
-మంచిర్యాల స్టాఫ్ ఫొటోగ్రాఫర్