“టీఎన్జీవో నేతలు టీఆర్ఎస్కు అమ్ముడు పోయారు. పదోన్నతులు, పైరవీల కోసం సిగ్గులేకుండా అధికార పార్టీకి మద్దతివ్వడం సిగ్గుచేటు. వారిపై కేసులు పెట్టాలి.” అని మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్, టీఎన్జీవో, ఇతర కార్యాలయాల ఎదుట ఉద్యోగులు, సిబ్బంది మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధనలో మేము జీతాలు, సెలవులు తీసుకోకుండా పోరాడితే.. నీవు ఎక్కడున్నా వని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో టీఎన్జీవో తరఫున గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ఆదిలాబాద్/నిర్మల్, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ) : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఎన్జీవోలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయం ఎదుట ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు పాకాల శ్రీహరి, కార్యదర్శి భూముల రామ్మోహన్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, టీఎన్జీవో ఫారెస్ట్ సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు పొన్న మల్లయ్య, ఉపాధ్యక్షుడు కేజియా రాణి, శ్రీనివాస్ పాల్గొన్నారు. చెన్నూర్లో టీఎన్జీవో రాష్ట్ర అటవీ శాఖ ఫోరం అధ్యక్షుడు పొన్న మల్లయ్య ఆధ్వర్యంలో ఉద్యోగులు, సిబ్బంది కూడా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ యూనిట్ అధ్యక్షుడు మామిడి రాజన్న, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా టీఎన్జీవోలు ఆందోళన నిర్వహించారు. బండి సంజయ్ డౌన్ డౌన్.. ఉద్యోగులను అవమాన పరిచే విధంగా మాట్లాడిన మాటలను బేషరతుగా వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అలాగే జిల్లా సహకార శాఖ కార్యాలయం ఎదుట ఉద్యోగులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు సంద అశోక్, ప్రధాన కార్యదర్శి ఎ.నవీన్కుమార్, తిరుమల్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు గోపి, చంద్రమోహన్, గంగాధర్, సుజాత, రాజేశ్వర్, ఓంప్రసాద్, జయమ్మ, మానిక్ నారాయణ, పట్టణ శాఖ అధ్యక్షుడు మహేందర్, రూరల్ అధ్యక్షుడు ప్రవీణ్, కార్యదర్శి దత్తు, జైనథ్ యూనిట్ కార్యదర్శి మహేందర్, రామకృష్ణ, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంగాధర్, కార్యదర్శి ఇందిరా, డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు సబ్దర్ అలీ, మహిళా ఉద్యోగులు లక్ష్మీ, రాధ, ఇందిరా, ప్రేమలత పాల్గొన్నారు.
నిర్మల్లోని కలెక్టరేట్లో బండిసంజయ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన ఉద్యోగులు
నిర్మల్ జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్నం భోజన విరామ సమయంలో టీఎన్జీవో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ మద్దతు తెలిపారు. బండి సంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదురుగా టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పోచ్చయ్య, రాజశేఖర్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజాజ్ హుస్సేన్, జితేందర్, కరుణశ్రీ పాల్గొన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని ఈఎస్ఐ దవాఖాన ఎదుట భోజన విరామ సమయంలో టీఎన్జీవో ఉద్యోగుల సంఘం నాయకులు నల్లా బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ఉద్యోగుల సంఘం ప్రతినిధులు శ్రీనివాస్, శ్రీనివాస్, కవేర్పాల్, శక్తి సింగ్, ఇక్బాల్ అహ్మద్, రామకృష్ణ, అంకూస్, బేగ్, సంతప్, రవీందర్ పాల్గోన్నారు.
క్షమాపణలు చెప్పాల్సిందే..
బండి సంజయ్ ఉద్యోగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోని క్షమాపణ చెప్పాలి. సహనం కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదు. గతంలో కూడా చాలా సార్లు ఇలానే వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనలో టీఎన్జీవోలు కీలకపాత్ర పోషించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే ఊరుకోం. వ్యాఖ్యలను వెనక్కితీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం.
– సంద అశోక్, టీఎన్జీవో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు
ఉద్యోగులను అవమానించడం సరికాదు..
ప్రభుత్వ ఉద్యోగులు అమ్ముడు పోయారని బండి సంజయ్ వ్యాఖ్యానించడాన్ని ఉద్యోగులంతా తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఏ ప్రభుత్వంలో అయినా పరిపాలన అందించేది ఉద్యోగులేనని, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉంటుంది. అలాంటి వారిని అవమానించడం సరికాదు. ఇప్పటికైనా ఆయన ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి.
– డీ.రాములు, ఉద్యోగి, ఉద్యానవన శాఖ.
పదే, పదే అవమానించడం తగదు..
ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతినేలా బండి సంజయ్ పదే, పదే అవమానించడం తగదు. ఉద్యో గుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన సంజయ్ ఉద్యోగులకు, సంఘాల నాయకుల కు వెంటనే క్షమాపణ చెప్పాలి. పార్టీలు, రాజకీయాలు, ఉద్యోగ సంఘాలు వేరనే విషయాన్ని గుర్తించాలి. తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టింది. ఉద్యోగులేననే విషయాన్ని గ్రహించాలి. – ఏ.నవీన్కుమార్, టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి
దూషణలకు దిగడం సరికాదు..
బండి సంజయ్ ఎటువంటి ఆధారాలు లేకుండా ఉద్యోగులపై దూషణలకు దిగడం సరికాదు. ఉద్యోగులపై తన వైఖరిని మార్చుకోవాలి. గతంలో కూడా పలు మార్లు ఉద్యోగులపై పౌరుష పదజాలాన్ని వాడారు. టీఎన్జీవోలు రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముడు పోయారని పేర్కొనడం బాధాకరం. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలి. ఇప్పటికైనా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి.
– కే.దాసు, ఉద్యోగి, రెవెన్యూ శాఖ.
బహిరంగ క్షమాపణ చెప్పాలి..
బండి సంజయ్ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలకు భేషర తుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఆయన క్షమాపణలు చెప్పే వరకు మేం నిరసనలు తెలుపుతూనే ఉంటాం. తెలంగాణ కోసం రక్తం ధారపోసిన ఉద్యోగుల నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదు.
– రాంమోహ్మన్, టీఎన్జీవో కార్యదర్శి, మంచిర్యాల.
అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి..
రాష్ట్ర అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్న ఉద్యోగులపై సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికారు. మమ్మల్ని ఏమన్న అంటే ఊరుకునేది లేదు. ఉద్యోగులతో పెట్టుకుంటే మీకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడికి పోయినవ్ సంజయ్ అని ప్రశ్నించారు.
– రాజశేఖర్, టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి, కుమ్రం భీం ఆసిఫాబాద్.
తీవ్ర పరిణామాలు తప్పవు..
సంజయ్ మరోసారి ఉద్యోగులు అమ్ముడుపోయారని మాట్లాడారని, మరోసారి అలా మాట్లాడితే ఉద్యోగుల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో జీతాలు, సెలవులు లేకుండా పోరాడిన గుర్తులేదా అని ప్రశ్నించారు. ఉద్యోగులు అమ్ముడు పోయారని మాట్లాడడం సరికాదు. రాబోయే రోజుల్లో టీఎన్జీవో తరఫున తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు.
– ప్రభాకర్, కాగజ్నగర్ టీఎన్జీవో పట్టణ అధ్యక్షుడు.