సీసీసీ నస్పూర్, డిసెంబర్ 30: సింగరేణి వ్యాప్తంగా ఉన్న భూగర్భ గనుల ఉత్పత్తిలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 టాప్ ప్లేస్లో ఉందని గని మేనేజర్ ఈ తిరుపతి తెలిపారు. శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్కే 6గనికి 1లక్ష 80 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని విధించగా, ఇప్పటి వరకు 1.46 వేల టన్నులు సాధించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 110 శాతం ఉత్పత్తి సాధించి సింగరేణి వ్యాప్తంగా ముందున్నామని తెలిపారు.
ఏరియా జీఎం సంజీవరెడ్డి, ఏజెంట్ ఏవీ రెడ్డి సహకారంతో ఉద్యోగులు, అధికారుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని, ఇదే స్ఫూర్తితో ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సేఫ్టీ వీక్, ఎస్డీఎల్ నిర్వహణలో సింగరేణి వ్యాప్తంగా ఆర్కే 6 గనికి అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. బొగ్గు సంస్థలకు సంబంధించిన ఇండియా స్టార్ రేటింగ్లో జాతీయ స్థాయిలో గనికి 4వ స్టార్ వచ్చిందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో గని రక్షణాధికారికి బెస్ట్ అవార్డు వచ్చిందని చెప్పారు. అయితే గనిలో కార్మికుల గైర్హాజరు శాతం తమకు ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు.
900 మంది పనిచేసే గనిలో 30 శాతం మంది గైర్హాజరవుతున్నట్లు తెలిపారు. ఇందులో యువ కార్మికులే ఎక్కువగా ఉంటున్నారని పేర్కొన్నారు. 2025 జనవరితో గని జీవితకాలం ముగుస్తుందని, ఆలోగా గనిలో మిగిలిన బొగ్గు నిక్షేపాలు వెలికితీస్తామని తెలిపారు. గని రక్షణాధికారి కాదాసి శ్రీనివాస్, జనరల్ షిఫ్ట్ ఇన్చార్జి కొమురయ్య, పిట్ ఇంజినీర్ శ్యాంకుమార్, సెక్షన్ ఇంజినీర్ మహేశ్, సర్వేయర్ వర్మ, వెంటిలేషన్ అధికారి రాంనర్సయ్య, అండర్ మేనేజర్లు శ్రీనివాస్, రంజిత్, ప్రశాంత్, శరత్, తదితరులు పాల్గొన్నారు.