ఆదిలాబాద్ జిల్లా భీంపూర్, జైనథ్ మండలాల్లో పులి, దాని మూడు పిల్లలు సంచరించాయి. 22 రోజుల్లో పిప్పల్కోటి రిజర్వాయర్ పనులు చేసే కూలీలు, చేల వద్దకు వెళ్లే రైతులు, రహదారి గుండా వెళ్లే ప్రయాణిలకు తరచుగా కనిపించాయి. బుధవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పిప్పల్కోటి నుంచి తాంసి(కే) వైపు వెళ్లే రహదారిలో గల బోర్లకుంట ప్రాంతం వద్ద దర్శనమిచ్చాయి. ఉదయం 6.30 గంటలకు మహారాష్ట్రలోని ఇవ్రీ ప్రాంతంలో పాదముద్రలు, పద్మాసనాలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పెన్గంగ మీదుగా ఇవ్రీ, చనాక, రాంనగర్ అటవీ ప్రాంతాల గుండా తిప్పేశ్వర్ అభయారణ్యం చేరుతాయని ఎఫ్ఆర్వో గులాబ్సింగ్, ఎఫ్ఎస్వో ప్రేంసింగ్ తెలిపారు.
భీంపూర్, నవంబర్ 30 : ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, జైనథ్ మండలాల్లో గల పిప్పల్కోటి, గొల్లగఢ్, నిపాని, గుంజాల, తాంసి(కే), చనాక, రాంగనర్, హత్తిఘాట్ అటవీ ప్రాంతాల్లో 22 రోజులుగా పులితోపాటు దాని మూడు పిల్లలు కూడా సంచరిస్తున్నాయి. మొదటగా జైనథ్ మండలంలోని హత్తిఘాట్ ప్రాంతంలో స్థానికులకు కనిపించాయి. అప్పటి నుంచి తరచుగా ప్రయాణికులకు కనిపిస్తూనే ఉన్నాయి. బుధవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పిప్పల్కోటి నుంచి తాంసి(కే) వైపు వెళ్లే రహదారిలో గల బోర్లకుంట ప్రాంతం వద్ద రిజర్వాయర్ పనులు చేస్తున్న కూలీలకు కనిపించాయి. వారు సెల్లలో చిత్రాలను తీశారు. వెంటనే స్థానిక సర్పంచ్లకు సమాచారం అందించారు. సోమవారం అర్ధరాత్రి కూడా కనిపించాయి. బుధవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో మహారాష్ట్రలోని ఇవ్రీ గ్రామంలో పాదముద్రలు, పద్మాసనాలను కనిపెట్టారు. పులి, మూడు పిల్లలు కూడా మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం వెళ్లాయని ఎఫ్ఆర్వో గులాబ్సింగ్, ఎఫ్ఎస్వో ప్రేంసింగ్ ధ్రువీకరించారు.
తెలంగాణ సర్కారు ప్రత్యేక చర్యలు
తెలంగాణ రాష్ట్ర సర్కారు పులుల సంచారానికి అనువైన వాతావరణం కల్పిస్తున్నది. చెలిమెలు, చెక్డ్యాంలు, చిన్నచిన్న నీటి గుంతలు, సాసర్పిట్లు నిర్మించింది. బోర్లు వేసి సోలార్ విద్యుత్ ఆధారంగా నీటిని సరఫరా చేస్తున్నది. ఒక్కో పులి యేడాదికి 300 నుంచి 350 వరకు శాకాహార జంతువులను ఆహారంగా తీసుకుంటుంది. అడవి పందులు, జింకలు, దుప్పులు, నీల్గాయ్లు, మనుబోతులు, కొండ గొర్రెలను పెంచుతున్నది. శాకాహార జంతువులకు అవసరమైన పచ్చిగడ్డి క్షేత్రాలను కూడా పెంచుతున్నది. వీటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. నైట్ విజన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. విడుతలవారీగా ఎనిమల్ ట్రాకర్స్ విధులు నిర్వహిస్తున్నారు. స్థానిక గ్రామాల ప్రజలు, రైతులు, బయపడవద్దని చేలకు కూడా వెళ్లవచ్చిని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.