కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/పెంచికల్పేట్, డిసెంబర్ 12 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లోకి పులుల రాకపోకలు పెరుగగా, సమీప గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రధానంగా నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో అవి సంగమించే సమయం కావడంతో తోడు కోసం వెతికే క్రమంలో దాడులకు పాల్పడుతుండగా, గత మూడేళ్లు.. ఇదే సీజన్లో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముగ్గురిపై పంజా విసిరి పొట్టన బెట్టుకోవడంతో పాటు 70కి పైగా మూగజీవాలను హతమార్చాయి. తాజాగా.. మంగళవారం కాగజ్నగర్ రేంజ్ పరిధిలో పశువుల కాపరిని గాయపర్చడం.. దడ పుట్టిస్తున్నది. ఈ నేపథ్యంలో అధికారులు పల్లెల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులు పులుల ఆవాసానికి అనువైన ప్రాంతంగా మారింది. తడోబా, తిప్పేశ్వర్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రాణహిత సరిహద్దులు దాటుకొని యేటా ఈ సీజన్లో మాహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లోని పులుల అభయారణ్యాల నుంచి ఆసిఫాబాద్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల సహరిద్దు అటవీ ప్రాంతాల్లోకి రాకపోకలు సాగిస్తుంటాయి. కాగజ్నగర్ టైగర్ కారిడార్ ఇంద్రావతి, తడోబాతో పాటు ఇటు కవ్వాల్ అభయారణ్యాలకు కూడలిగా ఉండడంతో ఈ ప్రాంతాల్లో పులులకు స్థావరంగా ఉంటోంది. సాధారణంగా నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో పులులు సంగమించే సమయం. జత కోసం, ఆహారం కోసం మహారాష్ర్టాలోని అభయారణ్యాల నుంచి ప్రాణహిత సరిహద్దుల గుండా వస్తున్నాయి. దాదాపు మూడేళ్లుగా ఇదే సీజన్లో పులుల దాడులు జరిగాయి. చేలల్లో పనులు చేసుకుంటున్న కూలీలు, రైతులతో పాటు మేతకు వెళ్లిన పశువులపైనా పంజా విసిరాయి. అదృష్టవశాత్తు ఈ ఏడాది ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో అటవీ సమీప గ్రామాలకు ప్రమాదం పొంచి ఉండగా, అప్రమత్తంగా ఉండాలంటూ అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆదివాసులంతా అడవులపైనే ఆధారపడి జీవిస్తుంటారు. ముఖ్యంగా కోయ, మన్నేవార్, తోటి, గోండ్ గిరిజనుల జీవనం పూర్తి అడవులతోనే ముడిపడి ఉంటుంది. తరతరాలుగా వారి వ్యవసాయం అడవుల్లోనే సాగుతుంది. నివాస గ్రామాలు అడవులనే ఆనుకొని ఉంటాయి. ఉదయం లేచింది మొదలు.. రాత్రి వరకూ అడవిలోనే పనులు చేసుకుంటుంటారు. పదేళ్లు నిండని పిల్లలను కూడా తల్లిండ్రులు తమ వెంట చేలకు తీసుకెళ్తుంటారు. ముఖ్యంగా పత్తి తీసే సమయాల్లో అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
మూడేళ్లలో ఘటనలు..
జిల్లాలో 2020, నవంబర్లో దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన సిడాం విగ్నేష్పై పులి దాడి చేసి చంపింది. విగ్నేష్ చేపల వేటకు వెళ్లిన సమయంలో ఇది జరిగింది. ఈ ఘటన మరువక ముందే.. ఇదే నెల లో పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన పసుల నిర్మల (15)ను పులి చం పింది. గ్రామానికి సమీపంలోని చేనులో పత్తి ఏరుతుండగా పెద్ద పులి దాడిచేసి నోట కరుచుకపోయింది. గతేడాది వాంకిడి మండలం చౌ పన్గూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఖానాపూర్కు చెందిన సిడాం భీము అనే రైతు పత్తి ఏరేందుకు వెళ్లగా.. పులి దాడి చేసి చంపింది. అలాగే దాదాపు 120 పశువులపై దాడులు చేయగా, ఇందులో సుమారు 70 మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయాయి. యేటా నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లోనే ఈ ఘటనలు జరగడం కలకలం రేపుతున్నాయి.
అటవీ గ్రామాల్లో అవగాహన
తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీడివిజన్ పరిధిలోని పెంచికల్పేట్ రేంజ్ పులుల ఆవాసము, సంరక్షణ, సంతతి అభివృద్ధికి పేరుగాంచిన ప్రాంతం. ఈ రేంజ్లో దట్టమైన అడవులు ఉండడం.. ప్రాణహితనది, పెద్దవాగు, గుహలు ఉండడంతో ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. ప్రధానంగా పంటలు చేతికి వచ్చే దశలో అవి ఎకువగా పంట చేలల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. మేతకోసం వచ్చే పందులను వేటాడి తింటాయి. ఇదే సమయంలో చేలకు వచ్చే రైతులు, కూలీలపై దాడి చేస్తుంటాయి. పశువులపైనా పంజా విసురుతాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గిరిజన గ్రామాలైన ఎర్రగుంట, కొండపల్లి, లోడ్పల్లి, జైహింద్పూర్, మేరగూడ,అగర్గూడ , గుండేపల్లి, కమ్మర్గాం, నందిగాం, జిల్లెడ, మోర్లిగూడలలో గ్రామస్తులకు అటవీ అధికారులు ప్రత్యేక అవగాహన కల్పిస్తూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గుంపులు గుంపులుగా శబ్ధాలు చేస్తూ చేలకు వెళ్లాలి. అలాంటప్పుడే పులుల నుంచి మనకు హానీ ఉండదు. పులులు సంచరించే ప్రాంతంలో పెగ్ మారులుగాని, అలజడిగాని ఉంటే అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలి. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవద్దు.
– వేణుగోపాల్, ఎఫ్ఆర్వో, పెంచికల్పేట్
పులి దాడిలో ఒకరికి గాయాలు
కాగజ్నగర్ ఎస్పీఎం కాలనీ, డిసెంబర్ 12 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని వంజిరి గ్రామానికి చెందిన అల్లూరి గులాబ్ దాస్ ఊరి పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో పశువులను మేపుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో పెద్దపులి ఒక పశువుపై దాడి చేసింది. ఇది గమనించిన గులాబ్ దాస్ పులిని అతని చేతిలో ఉన్న కర్రతో బాదాడు. దీంతో పులి ఒక్కసారిగా అతనిపై దాడి చేసి పారి పోయింది. కేకలు వేయడంతో ఆ ప్రాంతంలోనే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీ శాఖ సిబ్బంది గమనించారు. చేతికి, నడుంపై గాయాలు కావడంతో పశువుల కాపరిని హుటాహుటిన కాగజ్నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం ఏమి లేదని అధికారులు తెలిపారు.
జాగ్రత్తలివే..