తాండూర్ : తెలంగాణ ఉద్యమం ( Telangana movement ) లో వివిధ దశల్లో పోరాటం చేసిన వారిని గుర్తించి వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యమకారుల
రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ ( Todeti Shankar Goud ) అన్నారు. తాండూర్ మండల కేంద్రంలోని మినీ సురభి ఫంక్షన్ హాల్లో ఉద్యమకారుల వేదిక మండల అధ్యక్షులు చెప్యాల నిరంజన్ రావు అధ్యక్షతన తెలంగాణ ఉద్యమకారుల వేదిక సమావేశం ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ రెండున్నర ఏళ్లలో ఎలాంటి మేలు చేయలేదని ఆరోపించారు. కేశవరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి కమిటీ నిష్పక్షపాతంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలని కోరారు.
అనంతరం ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎల్తూర్ శంకర్, జిల్లా అధ్యక్షుడు గోగర్ల రాజేశం, బెల్లంపల్లి మండల అధ్యక్షులు అచ్చ సత్తయ్య, తాండూర్ మండల ఉద్యమకారులు మాసాడి శ్రీరాములు, ఆగమరావు, శేఖర్, మద్దిబోయిన అర్జున్, హనీఫ్, నర్సింహస్వామి, కొమరయ్య, రఘుపతి, జయరాం, తదితరులు పాల్గొన్నారు.