మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 5: ప్రజల అవసరాలను తెలుసుకుని పనులు చేసే నాయకులకే జనం మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఐదోవార్డు మజీద్వాడలో కౌన్సిలర్ సుదమళ్ల హరికృష్ణతో కలిసి పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలోనే అమలవుతున్నాయని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా విధానమే కారణమని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనల్లో నుంచి పుట్టుకువచ్చిన సంక్షేమ పథకాలు దేశంలోనే అద్భుతంగా నిలుస్తున్నాయని తెలిపారు.
ముఖ్యంగా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, కంటివెలుగు, కేసీఆర్ కిట్, ఉచిత విద్యుత్, నిరంతర విద్యుత్, కేజీ టూ పీజీ ఉచిత విద్య, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, తదితర కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు. మంచిర్యాల మున్సిపాలిటీలో అన్ని వార్డులకూ సమ ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, తమ పార్టీ కౌన్సిలర్లు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ వార్డు అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు. కొంతమంది నాయకులు పనిగట్టుకుని బద్నాం చేసే పనిలో నిమగ్నమయ్యారని, వారికి ఏది చేసినా నచ్చడం లేదని, వారికి అభివృద్ధి చేయడం ఇష్టం లేనట్లున్నదని ఎద్దేవా చేశారు. అలాంటి నాయకులకు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు షేక్ తాజ్బాబా, యూత్ ప్రెసిడెంట్ ప్రశాంత్, చిట్టిబాషా, ఆవునూరి రవి, ఎర్రోళ్ల శ్రీనివాస్, బాబూరావు, జావిద్, కడమ నర్సయ్య, మహేశ్, అమ్జద్, తదితరులు పాల్గొన్నారు.