ఆదిలాబాద్, జూన్ 7 ( నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల రంగం అస్తవ్యస్తంగా ఉండేదని, ఇప్పుడు అద్భుతమైన ప్రగతి సాధించిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బుధవారం సాగునీటి దినోత్సవాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్లో నిర్వహించి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్లలో సాగునీటి రంగం గణనీయమైన అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. జైనథ్ మండలంలో 1967లో నిర్మించిన సాత్నాల ప్రాజెక్టుకు 24 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో 5 వేల ఎకరాలకు నీరు పారలేదని, ఆయకట్టు రైతులకు నీరు అందలేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లతో మరమ్మతులు చేపట్టినట్లు చెప్పారు. ప్రాజెక్టు ద్వారా 20 వేల ఎకరాలకు నీరు అందుతున్నట్లు స్పష్టం చేశారు. మిగిలిన నాలుగు వేల ఎకరాలు చనాకా ప్రాజెక్టు కిందికి వచ్చినట్లు తెలిపారు.
పెన్గంగపై రూ.1261 కోట్లతో చనాకా, కొరాట ప్రాజెక్టును నిర్మిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టుల విషయంలో 40 యేండ్లుగా గత ప్రభుత్వాలు, అప్పటి జిల్లా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని, ఎన్నికల సమయంలో మాత్రం ఆయుధంగా వాడుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని, పనులు చివరిదశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ ఏడాది ప్రాజెక్టు ద్వారా ఆయకట్టు రైతులకు 15 వేల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. ప్రతిపక్షాలు ప్రాజెక్టు విషయంలో రైతులను పక్కదారి పట్టించవద్దని సూచించారు. మిషన్ కాకతీయ కింద గొలుసుకట్ట చెరువులు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 40 చెరువులు అభివృద్ధి చేశామన్నారు. మిషన్ కాకతీయ ఫలితంగా ఆయకట్టు రైతులు రెండు పంటలు సాగుచేస్తున్నట్లు తెలిపారు. ‘సాగునీటి రంగంలో ప్రగతి ప్రవాహం.. మా తెలంగాణం.. కోటి ఎకరాల మాగాణం’ పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రోకండ్ల రమేశన్, ఇరిగేషన్ ఈఈ రవీందర్ పాల్గొన్నారు.