ఈ ఏడాది జిల్లాలో పుష్కలంగా వర్షాలు పడగా, యాసంగి సాగుకు ఢోకా లేకుంటైంది. కుమ్రం భీం, వట్టివాగు, చెల్లిమెల(ఎన్టీఆర్ సాగర్) ప్రాజెక్టులతో పాటు చెరువులు నిండుకుండలను తలపిస్తుండగా, ప్రస్తుతం పంటలకు నీటి విడుదల కొనసాగుతున్నది. గతేడాది యాసంగిలో 29,398 ఎకరాల్లో పంటలు వేయగా, ఈ ఏడాది 8,466 ఎకరాల్లో అదనంగా సాగు పెరిగింది. ఇప్పటికే యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేయగా, రైతాంగం సంబురంగా సాగుకు సన్నద్ధమైంది.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ)
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడగా చెరువులు, ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. జలవనరుల్లో పూర్తిస్థాయి నీటి మట్టం ఉండగా, ఈ యాసంగి సాగుకు ఢోకా లేకుంటైంది. ఈసారి 37 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తుండగా, రైతాంగం సిద్ధమవుతున్నది.
జిల్లాలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించే ప్రధాన ప్రాజెక్టులైన కుమ్రం భీం, వట్టి వాగు, చెలిమెల(ఎన్టీఆర్ సాగర్) ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటితో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురువడంతో ప్రాజెక్టులు నిండుకున్నాయి. కుమ్రం భీం ప్రాజెక్టు కాలువల ద్వారా నీటి విడుదలను అధికారులు నిరంతరం కొనసాగిస్తుండడంతో దిగువ ప్రాంతాల పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతోంది. మొత్తంగా ఈ ప్రాజెక్టు ద్వారా 10 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. కాలువలు పూర్తికాకపోయినా రైతులు కాలువల్లో మోటర్లు పెట్టుకొని పంటలకు సాగునీరు అందిస్తున్నారు.
ఇక వట్టివాగు ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం కుడికాలువ ద్వారా 15 క్యూసెక్యులు, ఎడమ కాలువ ద్వారా 5 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ యాసంగిలో ఈ ప్రాజెక్టు నుంచి సుమారు 2 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. చెలిమెల వాగు ప్రాజెక్టుద్వారా యాసంగిలో 2 వేల ఎకరాల వరకు సాగునీరు అందనున్నది. వీటికి తోడుగా జిల్లాలోని 411 చెరువుల ద్వారా 8 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. ప్రభుత్వం ఉచితంగా అందించే వ్యవసాయ విద్యుత్ మోటర్ల ద్వారా మరో 15 వేల ఎకరాలకు పైగా నీరు అందనున్నది.
ఈ ఏడాది యాసంగిలో 37,864 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వరి 16400 ఎకరాలు, పెసర 1350 ఎకరాలు, జొ న్న 7000, మొక్క జొన్న 1700, శనగ 6500, గోధుమ లు 11 00, వేరుశనగ 260, ఇతర పంటలు 3554 ఎకరాలు సా గతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. యూరియా 3434 మెట్రిక్ ట న్నులు, డీఏసీ 1743, పొటాష్ 1970, సూపర్ పాస్ఫేట్ 51, కాం ప్లెక్స్ ఎరువులు 1380 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లాలో గతేడాది 29,398 ఎకరాల్లో పంటలు వేయగా, ఈ ఏడాది 8,466 ఎకరాల్లో అదనంగా సాగు పెరిగింది. ప్రధానంగా వరిసాగు గతేడాది 13275 ఎకరాల్లో సాగు కాగా, ఈ ఏడాది 16,400 ఎకరాలకు పెరిగింది. ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్తో రైతులు ఢోకా లేకుంట పంటలు వేసుకుంటున్నారు.