యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) మంగళవారం ప్రకటించిన సివిల్ సర్వీసెస్(2022) ఫలితాల్లో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావాసులు సత్తా చాటారు. ఆలిండియా స్థాయిలో గిరిజన, దళిత, రైతుబిడ్డలు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కర్ణపేటకు చెందిన అజ్మీరా సంకేత్కుమార్ 35వ ర్యాంకు, చెన్నూర్ మండలంలోని సోమన్పల్లికి చెందిన సాయికృష్ణ 640వ ర్యాంకు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని తుంగెడ గ్రామానికి చెందిన దళితబిడ్డ డోంగ్రి రేవయ్య 410వ ర్యాంకులు సాధించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన వారు అయినప్పటికీ కష్టపడి, పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. రేవయ్య మొదటిసారి, సంకేత్, సాయికృష్ణ రెండో ప్రయత్నంలో విజయతీరాలు అందుకున్నారు. జాతీయస్థాయిలో ప్రతిభ చూపడంపై తుంగెడ, కర్ణపేట, సోమన్పల్లిల్లో గ్రామస్తులు సంబురాలు చేసుకున్నారు.
సంకేత్ కుమార్ గిరిజన యువకుడు. ప్రాథమిక విద్యాభ్యాసం ప్రభుత్వ, ఉన్నత చదువులు ప్రైవేట్లో చేశాడు. జపాన్లో ఉద్యోగం చేసినా సంతృప్తిని ఇవ్వలేదు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ప్రిపేర్ అయ్యాడు. మొదటిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లగా.. రెండోసారి లక్ష్యాన్ని చేరుకున్నాడు.
రేవయ్య దళిత బిడ్డ. నిరుపేద కుటుంబం. తండ్రి చనిపోగా.. తల్లి ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తూ చదివించింది. ప్రాథమిక విద్యాభ్యాసం కాగజ్నగర్, ఉన్నత విద్యాభ్యాసం గురుకులంలో సాగింది. మద్రాస్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేసి.. ఓఎన్జీసీలో ఉద్యోగం సాధించాడు. సివిల్స్ సాధించాలని ఉద్యోగం వదిలేసి పూర్తిస్థాయిలో ప్రిపేరై విజయం సాధించాడు.
సాయికృష్ణది వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు తుమ్మల రాజేశ్వర్రెడ్డి, సంతోషి. ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగానే కొనసాగింది. కొవిడ్ టైంలో ఆన్లైన్ సివిల్స్ కోచింగ్ తీసుకోగా అనుకున్న ర్యాంకు రాలేదు. రెండో ప్రయత్నంలో సివిల్స్లో 640 ర్యాంకు సాధించాడు.
చెన్నూర్ రూరల్, మే 23 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని సోమన్పల్లి గ్రామానికి చెందిన సాయికృష్ణ మంగళవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 640వ ర్యాంకు సాధించాడు. తుమ్మల రాజేశ్వర్రెడ్డి, సంతోషి దంపతులది వ్యవసాయ కుటుంబం. పెద్ద కుమారుడు హైదరాబాద్లోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు సాయికృష్ణకు చిన్నతనం నుండే సివిల్స్ సాధించాలన్న తపన ఉండేది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చెన్నూర్లోని ప్రైవేటు పాఠశాలలో చదువుకున్నాడు. హైదరాబాద్లో ఇంటర్మీడియట్ పూర్తిచేసి, వరంగల్ ఎన్ఐటీలో చదివాడు. 2021 సంవత్సరం కొవిడ్ సమయంలో ఆన్లైన్ సివిల్స్ కోచింగ్ తీసుకోగా అనుకున్న ర్యాంకు రాలేదు. 2022 సంవత్సరంలో పట్టుదలతో చదివి సివిల్స్ రాశాడు. రెండో ప్రయత్నంలో సివిల్స్లో 640 ర్యాంకు సాధించడంపై తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రెబ్బెన, మే 23 : యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్(2022) ఫలితాల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని తుంగెడ గ్రామానికి చెందిన దళితబిడ్డ డోంగ్రి రేవయ్య ఆలిండియా స్థాయిలో 410వ ర్యాంక్ సాధించాడు. విస్తారుబాయి-మనోహర్ దంపతులకు ముగ్గురు సంతానం. ఇందులో ఇద్దరు కుమారులు, ఒక కూతురు. తండ్రి మనోహర్ చిన్నతనంలోనే చనిపోగా.. తల్లి విస్తారుబాయి తుంగెడలోని ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా పనులు చేస్తూ ముగ్గురు పిల్లలను ఉన్నత చదువులు చదివించింది. కూతురు స్వప్న నాగ్పూర్ ఎన్ఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఉద్యోగం కోసం ఫ్రిపేర్ అవుతున్నది. పెద్ద కుమారుడు శ్రవణ్ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. రెండో కుమారుడు డోంగ్రి రేవయ్య చిన్నతనం నుంచి బంధువుల ఇంట్లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగించాడు. 1-4వ తరగతి వరకు కాగజ్నగర్లోని శిశుమందిర్లో.. 5-10వ తరగతి వరకు ఆసిఫాబాద్లోని సోషల్ వెల్ఫేర్లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాద్లోని నాగోల్లో గల సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. జేఈఈ ఎంట్రెన్స్ రాసి మద్రాస్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. బీటెక్ పూర్తి చేసిన అనంతరం ఓఎన్జీసీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సివిల్స్కు ప్రిపేర్ అయ్యాడు. ర్యాంక్ సాధించాలనే తపనతో ఉద్యోగం వదిలేసి పూర్తిస్థాయిలో ప్రిపేర్ అయ్యాడు. యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ పరీక్ష రాయగా మంగళవారం ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ఆల్ ఇండియా స్థాయిలో 410వ ర్యాంక్ సాధించాడు. మారుమూల గ్రామమైన తుంగెడ నుంచి సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ సాధించడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.