భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి దాదాపు 74 రోజులు అవుతున్నది. అప్పటి నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మ్యానిఫెస్టోలోని అంశాలను గడపగడపకూ వెళ్లి వివరిస్తున్నారు. ప్రజా సంక్షేమానికి వందలాది పథకాలు తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
పది నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేచింది మొదలు.. పడుకునే వరకు క్యాంపేయిన్లను జోరుగా సాగిస్తున్నారు.తాజాగా ఆదివారం అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, బాల్క సుమన్, విఠల్రెడ్డి, జాన్సన్ నాయక్, జోగు రామన్న, అనిల్ జాదవ్, దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, కోవ లక్ష్మి ప్రచారం నిర్వహించారు. కాగా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రచారంలో వెనుకబడి ఉన్నాయి.
– మంచిర్యాల, నవంబర్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, నవంబర్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు ప్రజల్లోనే ఉంటూ దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ, ఇంటింటికీ తిరుగుతూ ప్రతి ఒక్కరినీ కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
దీనికి తోడు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్, భైంసాలో పర్యటించడం, 7వ తేదీన మందమర్రి, 8వ తేదీన బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్నగర్ నియోజకవర్గాలకు రానుండడంతో ఉత్సాహం రెట్టింపయ్యింది. సభలను విజయవంతం చేయడంతోపాటు, ప్రచారాస్త్రంగా సీఎం ‘ప్రజా ఆశీర్వాద సభ’లను అభ్యర్థులు వాడుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ దూకుడు ముందు ప్రతిపక్షాలు తెల్లముఖం వేస్తున్నాయి. మొన్ననే అభ్యర్థులను ప్రకటించినా.. అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయలేక చతికిల పడుతున్నాయి.
ప్రచారం చేసేందుకు బయటికొస్తే సొంత పార్టీలోని అసమ్మతివాదులు ఎక్కడ ఇబ్బంది పెడుతారో, ఎక్కడ అడ్డుపడుతారోననే భయంతో అభ్యర్థులు వణికిపోతున్నారు. టికెట్ ఆశించిన వారిని బుబ్జగించేందుకు, వారిని ప్రసన్నం చేసుకునేందుకు ముప్పుతిప్పలు పడుతున్నారు. ఈ పనులన్నీ అయి ప్రచారం మొదలు పెట్టేలోగా పుణ్యకాలం కాస్త పూర్తయ్యే ఛాన్స్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్లు అన్ని సర్దుకొని బయటికి వచ్చేలోగా బీఆర్ఎస్ ఒక దఫా ప్రచారం పూర్తి చేసుకొని, రెండో రౌండ్ మొదలుపెట్టేలా ఉండడంతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు, నాయకులు నారాజ్ అవుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో అభ్యర్థులు రోజూ ప్రచారంలోనే ఉంటున్నారు. అభ్యర్థులు ఆదివారం నిర్వహించిన ప్రచార కార్యక్రమాలకు జన నీరాజనం పట్టారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న హమాలీవాడ, మహాలక్ష్మివాడ, సుందరయ్యనగర్, డాల్డ కంపెనీ ఏరియాల్లో ప్రచారం నిర్వహించారు. బోథ్ అభ్యర్థి అనిల్ జాదవ్ తలమడుగు మండలం రుయ్యాడి, తలమడుగు, ఇచ్చోడ మండలం ముక్రా(బీ) గ్రామాల్లో ప్రచారం చేశారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య బెల్లంపల్లితోపాటు బెల్లంపల్లి రూరల్ ఏరియాల్లోని గ్రామాల్లో, తాండూర్ మండలంలో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కే-4లో ప్రచారం చేశారు. మందమర్రి మండలంలోని పలు గ్రామాలకు చెందిన 300 మందిని పార్టీలో చేర్చుకునే కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు మంచిర్యాల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో, యువనాయకుడు విజిత్ నస్పూర్లో ఇంటింటి ప్రచారం చేశారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిర్వహించిన చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగజ్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప ఆదివారం సంతలో ప్రచారం చేశారు. నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్రెడ్డి సోన్ మండలం, నిర్మల్ పట్టణంలోని ప్రలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి, పలు సమావేశాలు, చేరికల్లో పాల్గొన్నారు. ముథోల్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్రెడ్డి తానూర్ మండలంలోని పలు గ్రామాలు, ముథోల్లో ప్రచారం చేసి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ పెంబి మండలంలో ప్రచారం చేసి, పలువురు బీజేపీ నాయకులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునే కార్యక్రమంలో పాల్గొన్నారు.