ఆడ, మగ.. పుట్టే బిడ్డ ఎవరైనా ఇద్దరూ సమానమే. అయినా కొందరు స్కానింగ్ల ద్వారా తమకు పుట్టే బిడ్డలను తెలుసుకుంటూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల బలహీనతను ఆసరా చేసుకొని కొందరు డాక్టర్లు అబార్షన్లు చేస్తూ డబ్బులు గుంజుతున్నారు. దీనిపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లా వ్యాప్తంగా స్కానింగ్ సెంటర్లు, నర్సింగ్ హోంలపై నిఘా పెట్టింది. లింగనిర్ధారణ జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. నిరంతరం తనిఖీలు చేస్తూ, దవాఖానలను పర్యవేక్షిస్తున్నది.
ఎదులాపురం,మార్చి 30 : ఆడ, మగ ఇద్దరూ సమానమేననే భావన ఇంకా సమాజంలో నాటుకుపోవాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. సాంఘిక కట్టుబాట్లు, వరకట్న దురాచారం, శారీరక, మానసిక వేధింపుల వంటి వాటితో ఆడపిల్లలకు జన్మనివ్వాలంటేనే మహిళలు వెనుకాడుతున్నారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల బలహీనతను కొందరు డాక్టర్లు ఆధారంగా చేసుకొని పుట్టబోయేది ఆడబిడ్డ అయితే అబార్షన్లు చేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం స్కానింగ్ సెంటర్లు, నర్సింగ్ హోమ్లపై నిఘా వేసింది. ఇందులో భాగంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనార్దన్ రెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
ఎన్ని చట్టాలున్నా భ్రూణ హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజు రోజుకూ అమ్మాయిల నిష్పత్తి తగ్గుతూనే ఉంది. అమ్మాయిల సంఖ్యను మెరుగుపరచడానికి ప్రభుత్వం కళాజాత ,సదస్సులు నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నది. ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 33 స్కానింగ్ సెంటర్లకు అనుమతి ఉండగా, ప్రస్తుతం ఇందులో 27 పని చేస్తున్నాయి. వాటిపై నిరంతర పర్యవేక్షణతో పాటు నిఘా వేసింది. లింగనిర్ధారణ పరీక్షలకు సంప్రదించిన వారి వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు తెలియజేస్తున్నారు. స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తే వెంటనే సమాచారం అందించాలని కోరుతున్నారు.
మహిళ గర్భం దాల్చిన వెంటనే ఆమె పూర్తి వివరాలను వైద్య సిబ్బంది అంగన్వాడీ సెం టర్లో, స్థానిక పీహెచ్సీలో, యూపీహెచ్సీలో నమోదు చేసుకుంటున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న న్యూట్రీషన్ కిట్, పౌష్టికాహారం వారికి పంపిణీ చేస్తూ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరిస్తున్నారు.
భ్రూణ హత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం 1994లో ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్(పీఎన్డీటీ) అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం స్కానింగ్ సెంటర్లు, నర్సింగ్ హోమ్లు నడుచుకోవాల్సి ఉంటుంది. గర్భిణీకి అవసరాన్ని బట్టి పిండం ఎదుగుదలకు చెందిన పరీక్షలు మాత్రమే చేయాలి, మరే ఇతర పరీక్షలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటారు. గర్భంలోని పిండం ఆడ, మగా అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో బహిర్గతం చేయరాదు. స్కానింగ్ పరీక్షలు నిర్వహించిన మహిళ వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలి. ఒక రేడియాలజిస్టు రెండుకు మించి స్కానింగ్ సెంటర్లలో విధులు నిర్వహించకూడదు. లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి పట్టుబడినట్లుయితే సంబంధిత సెంటర్ రిజిస్ట్రేషన్ రద్దుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. నిజ నిర్ధారణ జరిగినట్లయితే చట్ట పరిధిలో మూడేళ్లు, అంతకు మించి జైలుశిక్ష, రూ.10వేలు, అంతకు మించి జరిమానా విధించే అవకాశం ఉంటుంది. స్కానింగ్ సెంటర్లు నిర్వహించిన వైద్యపరీక్షలకు పూర్తి బాధ్యత సెంటర్కు అనుసంధానంగా ఉన్న రేడియాలజిస్టుతో పాటు గైనకాలజిస్టులకు కూడా ఉంటుంది. వారిపై కూడా చర్యలు తీసుకుంటారు.
ఆదిలాబాద్ జిల్లాలోని స్కానింగ్ సెంటర్లపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నాం. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, రికార్డులను పరీక్షిస్తున్నాం. రికార్డుల నిర్వహణ సరిగాలేని వారికి నోటీసులు జారీ చేస్తున్నాం. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. అది నేరం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు.
– నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో, ఆదిలాబాద్