రైతు రాబంధు, చంద్రబాబు ప్రియశిష్యుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మూడు గంటల ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మూడో రోజైన గురువారం బీఆర్ఎస్ శ్రేణులు, రైతన్నలు ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి కూడళ్ల వద్ద ఉరి తీశారు. కొన్నిచోట్ల దహనం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌక్లో ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు రామన్న, బాపురావ్.. ఖానాపూర్లోని తెలంగాణ చౌక్లో ఎమ్మెల్యే రేఖానాయక్.. భైంసాలోని ఐబీ ఎదుట ఎమ్మెల్యే విఠల్రెడ్డిలు, గాదిగూడలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్లు పాల్గొన్నారు.
– ఆదిలాబాద్/నిర్మల్, జూలై 13(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్/నిర్మల్, జూలై 13(నమస్తే తెలంగాణ) : ‘వ్యవసాయానికి 24 గంటల కరెంటు అవసరం లేదు. మూడు గంటలు ఇస్తే చాలు.’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మూడో రోజైన గురువారం ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గాదిగూడలో నిర్వహించిన నిరసనలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్లు హాజరయ్యారు. ఆదిలాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌక్లో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మకు ఉరివేసి, దహనం చేశారు. గాదిగూడలో పీసీసీ అధ్యక్షుని దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రైతుల కు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని, రేవంత్రెడ్డి తమ పార్టీ వైఖరిని బహిర్గతం చేశారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
నిర్మల్ జిల్లాలో..
టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉచిత విద్యుత్పై రైతులను, ప్రభుత్వాన్ని కించ పరిచేలా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణు లు, రైతులు మూడో రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాలతోపాటు అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన కొనసాగింది. ఖానాపూర్లోని తెలంగాణ చౌక్లో నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొని రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. భైంసాలోని ఐబీ ఎదుట జరిగిన నిరసన, దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయా నిరసన కార్యక్రమాల్లో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.
కాంగ్రెస్కు బీజేపీ బీ టీం .. : ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులను కించపర్చేలా మాట్లాడారని, ఆయన వెంటనే అన్నదాతలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్ చేశారు. రైతులపై విషం కక్కిన రేవంత్ మరోసారి కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకం అని రుజువు చేసుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు శిష్యుడు రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ పార్టీ పెద్దలు వక్రీకరిస్తున్నారని అనడం వారి నీతిమాలిన చర్యలకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నా బీజేపీ నాయకుల్లో కనీసం చలనం లేదని, కాంగ్రెస్కు బీజేపీ బీ టీంగా పని చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వస్తే రైతులు నిలదీయాలని సూచించారు.
రైతులను కాంగ్రెస్ విస్మరించింది.. : బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
రాష్ట్రంలో 47 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మండిపడ్డారు. రైతుల అభివృద్ధిని ఓర్వలేకే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారన్నారు. రేవంత్రెడ్డి అన్నదాతలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు రోకండ్ల రమేశ్, గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్, ఇచ్చోడ ఎంపీపీ ప్రీతమ్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ పాల్గొన్నారు.