ఇదీ ప్రగతి..
ఉద్యోగాల జాతర
స్వరాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వెల్లివిరుస్తోంది. రాష్ట్ర సర్కారు పలు రంగాల్లో శిక్షణ ఇస్తూ.. పరిశ్రమలు నెలకొల్పడానికి సహాయ, సహకారాలు అందిస్తున్నది. నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ ఐపాస్), టీ ఫ్రైడ్ పథకాలు ప్రవేశపెట్టి పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నది. ఫలితంగా ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ(ఐటీ) విస్తరిస్తున్నది. మారుమూల ప్రాంతాలైన ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలు.. కార్మిక క్షేత్రమైన సింగరేణి ప్రాంతంలో యువతీయువకులు పలు ఐటీ కంపెనీలు స్థాపించారు. వందలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించి ఉపాధి చూపిస్తున్నారు. ఇప్పటికే ఐటీ శాఖా మాత్యులు మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించి ఐటీ ఉద్యోగులతో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాకు రూ.40 కోట్లతో ఐటీ కంపెనీని కూడా మంజూరు చేశారు.
– ఆదిలాబాద్, జూన్ 5(నమస్తే తెలంగాణ)
స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్ర సర్కారు యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. వృత్తి విద్యా కోర్సులు, పారిశ్రామిక రంగంలో అనుభవం ఉన్న వారికి ఉపాధి కల్పించడానికి కసరత్తు చేపట్టింది. పరిశ్రమల స్థాపనకు సులువైన పద్ధతులు అమలు చేస్తూ.. నూతనంగా పారిశ్రామిక విధానాన్ని(టీఎస్ ఐపాస్) ప్రవేశపెట్టింది. యువత తమకు అనుభవం ఉన్న రంగాల్లో పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో పద్ధతితో అనుమతులు జారీ చేస్తున్నది. ఉత్సాహవంతులైన పారిశ్రామికులకు రాయితీలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నది. దీంతోపాటు టీ ప్రైడ్ పథకంలో భాగంగా పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆర్థిక సాయం అందిస్తున్నది.
– ఆదిలాబాద్, జూన్ 5(నమస్తే తెలంగాణ)
కుటుంబ సభ్యులతో ఉంటూ ఉద్యోగం..
గతంలో హైదరాబాద్, బెంగళూరు, పూణె లాంటి నగరాలకు పరిమితమైన ఐటీ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాయి. ఉమ్మడి ఆదిలాబాద్లో కూడా ఐటీ కంపెనీలు వెలిశాయి. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఐటీ కంపెనీలు ప్రారంభం కాగా.. వందలాది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి. గతంలో ఐటీ, ఇతర ఉన్నత విద్య అభ్యసించిన నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఇతర పట్టణాలకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారు. ప్రభుత్వ సహకారంతో ఆదిలాబాద్లో ఏడాది కిందట బీడీఎన్టీ ఐటీ కంపెనీ ప్రారంభం కాగా.. అందులో 130 మంది ఉద్యోగాలు పొందారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రెండు ఐటీ కంపెనీల్లో 150 మంది వరకు ఉద్యోగాలు చేస్తున్నారు. జిల్లాకు ఐటీ రంగం విస్తరించడంతో యువకులు తమ సొంత జిల్లాలో మంచి వేతనాలతో కుటుంబ సభ్యులతో కలిసి ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు.
ఆదిలాబాద్లో రూ.40 కోట్లతో ఐటీ టవర్
ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ టవర్ నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు కాగా.. టెండర్లు కూడా పూర్తయ్యా యి. ఆదిలాబాద్ పట్టణానికి సమీపంలో మూడెకరాల్లో 48 వేల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించే టవర్లో పలు కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. కొత్తగా నిర్మించే ఐటీ టవర్లో 800 మంది ఐటీ ఇంజినీర్లు, మరో 200 మంది ఇతరులకు ఉద్యోగాలు లభించనున్నాయి. ఐటీ పరిశ్రమల కారణం గా జిల్లాలోని ఇతర రంగాలు కూడా ప్రగతి పథంలో పయనిస్తున్నాయి.
విస్తరించిన పారిశ్రామిక రంగం
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యువతీయువకులు పరిశ్రమలు స్థాపించి ఉపాధి పొందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ ఐపాస్) ద్వారా రూ.108 కోట్లతో 307 పరిశ్ర మలు స్థాపించింది. ఫలితంగా 2,219 మంది నిరుద్యోగులకు ఉపాధి లభించింది. టీ-ఫ్రైడ్లో భాగంగా 313 యూనిట్లకు రూ.19.71 కోట్లు మంజూరు చేసింది. మంచిర్యాల జిల్లాలో నూతన పారిశ్రామిక విధానం ద్వారా రూ.6,219 కోట్లతో 448 పరిశ్రమలు నెలకొల్పి 4,984 మందికి ఉపాధి కల్పిస్తున్నది. టీ ఫ్రైడ్లో భాగంగా 1,416 మంది లబ్ధిదారులకు రూ.58.65 కోట్లు మంజూరు చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టీఎస్ ఐపాస్ ద్వారా 215 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా రూ.767 కోట్లతో 180 పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. టీ ఫ్రైడ్లో భాగంగా లబ్ధిదారులకు రూ.225 కోట్లు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రారంభానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.