ఆదిలాబాద్ ప్రతినిధి/నిర్మల్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అదనంగా నాలుగు గురుకులాలు అందుబాటులోకి రానుండడంతో బీసీ విద్యార్థులకు మేలు జరగనుంది. ఆర్థిక స్థోమత లేక చాలామంది మధ్యలోనే చదువులను నిలిపివేస్తున్నారు. బీసీ విద్యార్థుల సంఖ్య కూడా ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా ఉండడంతో అందరికీ గురుకులాల్లో ప్రవేశాలు దొరకక కొంతమందికే లబ్ధి కలుగుతున్నది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ కొత్తగా మరికొన్ని గురుకులాలను మంజూరు చేశారు. బీసీ విద్యార్థుల సాధికారతకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తుండడంపై బీసీ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేవలం రెండు గురుకులాలు మాత్రమే ఉండేవి. ఆదిలాబాద్లో బాలికల గురుకుల పాఠశాల, మంచిర్యాలలో బాలుర గురుకుల పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. 2015వ సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్నగర్లలో ఒక్కొక్కటి చొప్పున గురుకులాలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏకంగా 20 గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఉమ్మడి జిల్లాలో గురుకులాల సంఖ్య 26కి చేరింది. యేటా గురుకులాలను అప్గ్రేడ్ చేస్తూ వస్తుండడంతో ప్రస్తుతం 14 గురుకులాలు ఇంటర్ విద్యను అందిస్తున్నాయి. పాత గురుకులాల్లో సుమారు 40 వేల మందికి పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు. పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక భవనాలను నిర్మించి కార్పేరేట్ విద్యాను అందిస్తుంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయడంతో పాటు మూడు జతల యూనిఫాంలు, రెండు జతల బూట్లు, కాస్మొటిక్స్, స్పోర్ట్స్ డ్రెస్ను విద్యార్థులకు పంపిణీ చేస్తున్నది. కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, ఇతర ప్రయోగశాలలతో పాటు అన్ని సౌకర్యాలు గురుకులాల్లో అందుబాటులో ఉంటున్నాయి. దీంతో వీటిలో చేరడానికి విద్యార్థులు పోటీ పడుతున్నారు.
అదిలాబాద్ జిల్లాకు కొత్తగా మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున గురుకులాలను మంజూరు చేసింది. నిర్మల్కు బాలుర గురుకులం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు బాలికల గురుకుల పాఠశాల మంజూరైంది. కొత్త గురుకుల పాఠశాలలను అక్టోబర్ 11న ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఆయా జిల్లాల్లో అనువైన భవనాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే 5, 6, 7 తరగతులను ప్రారంభించనున్నారు. ప్రవేశ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించి అడ్మిషన్లు కల్పించనున్నారు. దీంతో కొత్తగా 960 మంది విద్యార్థులకు అవకాశం కలుగనున్నది.