ఏదైనా వస్తువును మార్కెట్లో వదిలి.. జనాలకు అలవాటు చేసి.. ఆపై దోచేయడం కార్పొరేట్ ైస్టెల్! అచ్చు ఇలాగే వ్యవహరిస్తున్నది కేంద్రంలోని బీజేపీ సర్కారు! ప్రజాసంక్షేమం గురించి ఆలోచించాల్సింది పోయి ధరల పెంపుతో పేదలను దగా చేస్తున్నది. పొగ వల్ల దేశంలో ఏటా ఐదు లక్షల మరణాలు సంభవిస్తున్నాయన్న డబ్ల్యూహెచ్వో హెచ్చరికలతో ఆగమేఘాల మీద ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను తెచ్చిన కేంద్రం, 2016 నుంచి ఫ్రీ కనెక్షన్లు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పింది. కానీ, ఉచితం పేరిట అలవాటు చేసి, ఇప్పుడు సిలిండర్ ధరలు అమాంతం పెంచేసి వంటింట్లో మంటలు రేపుతున్నది. పాత కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతుండగా, మళ్లీ రేట్లను పెంచి కట్టెల పొయ్యిలవైపు ప్రజలను నెడుతున్నది. పెరిగిన భారాన్ని పేదలు భరించే పరిస్థితి లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా, కేంద్రం మాత్రం తనకేమీ పట్టదన్నట్టుగా వ్యవహరిస్తున్నది. సబ్సిడీలు పూర్తిగా ఎత్తివేసి, ధరల పెంపును చమురు కంపెనీలపైకి నెట్టేసి, తాను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. సిలిండర్ ధరలు ఇలాగే పెరిగితే మళ్లీ పాత పరిస్థితులు పునరావృతం కావడమే కాదు, ఆడబిడ్డలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం కనిపిస్తున్నది.
– కరీంనగర్, మార్చి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, మార్చి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పొగ సోకడం వల్లే కలిగే అనర్థాలు, జరుగుతున్న మరణాలు, తద్వారా మహిళలు పడుతున్న ఇబ్బందులపై గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశానికి హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా దేశంలో పేదలకు వంట గ్యాస్ అందడం లేదని, ఎల్ పీజీ సిలిండర్లు కేవలం కొన్ని ప్రాంతాలకు మా త్రమే పరిమితం అయ్యాయని చెప్పింది. గ్యాస్ సౌలభ్యం లేక కట్టెలపొయ్యిపై వంట చేయడం వల్ల ముఖ్యంగా మహిళలు అనారోగ్యం పాలవుతున్నా రంటూ 2015లో ఓ నివేదికను విడుదల చేసింది. అప్పట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అం చనా ప్రకారం దేశంలో ఏటా సుమారు 5 లక్షల మ రణాలు పొగ వల్లే సంభవిస్తున్నాయని స్పష్టం చేసింది. అలాగే గుండె జబ్బులు, ఉపరితిత్తుల క్యాన్సర్తోపాటు అంటు వ్యాధుల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంది. వంట గదిలోని ఒక పొయ్యి నుంచి వచ్చే పొగ ఒక గంటకు 400 సిగరెట్లు కాల్చిన ప్రభావాన్ని చూపుతుందని స్పష్టంచేసింది. ఈ మర ణాలను తగ్గించాలన్నా.. మహిళలను వివిధ రోగాల బారి నుంచి బయట పడేయాలన్నా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు పెంచాలంటూ తన నివేదికలో స్పష్టం చేసింది. భారత్ దీనిని సీరియస్గా తీసుకోవాలని సూచించింది.
కేంద్రం గొప్పలు
ప్రపంచ బ్యాంకు హెచ్చరికలతో తేరుకున్న కేం ద్రం దిగొచ్చింది. కేంద్ర పెట్రోలియం, సహజ వా యువుల మంత్రిత్వ శాఖ 2016, మే 1న ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రవేశపెట్టింది. దారిద్య్రరేఖకు (బీపీఎల్) దిగువన ఉన్న కు టుంబాలకు ఈ పథకం కింద లబ్ధి కల్పిం చింది. 2011లో సేకరించిన డేటాబేస్ ఆ ధారంగా బీపీఎల్ కుటుంబాలకు ఈ పథకం కింద కనెక్షన్లు ఇచ్చింది. అం దుకోసం గ్యాస్ కంపెనీలు అప్ప ట్లో మేళాలు నిర్వహించాయి. ఆయా కుటుంబాల పరి స్థితులు, అవసరాల ను బట్టి 14.2 కిలోలు, 5 కిలోల సిలిండర్లను అందించాయి.
ఈ పథకం కింద 2016, మే 1 నుంచి 2022 వరకు కనెక్షన్లు ఇచ్చాయి. అయితే ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ వర్గాలే లబ్ధి పొందా యని, ఈ పథకం ప్రారంభానికి ముందు 55 శాతం ఇండ్లల్లో మాత్రమే వంట గ్యాస్ వాడేవారని, ప్రస్తుతం 99.6 శాతానికి చేరిందని బీజేపీ వర్గాలు నిన్నామొన్నటి వరకు గొప్పలు చెప్పాయి. పథకం లక్ష్యం 5 కోట్ల ఇండ్లకు ఉచిత కనెక్షన్లు ఇవ్వడమే కానీ, 12 కోట్లకుపైగా కనెక్షన్లు ఇచ్చామని, తద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్పీజీ వినియోగ దేశంగా భారత్ మారిందని ఆ పార్టీ నా యకులు చెప్పుకున్నారు. ఈ పథకం మొదలయ్యాక ప్ర పంచ ఆరోగ్య సంస్థ. చెస్ట్ సొసైటీ, ఐఐఎం హైదరాబాద్, వరల్డ్ పెట్రోలియం కౌన్సిల్, దేశ విదేశ యూనివర్సిటీలు చేసిన అనేక సర్వేల్లో పొగలేని వంటతో కాలుష్య సమస్య లు తగ్గాయని, అడవుల్లో చెట్ల నరికివేత తగ్గిందని, మహి ళలు, వారి కుటుంబాలు లబ్ధిపొందాయని తెలిపాయి.
అలవాటు చేసి.. ఆపై ధరలు పెంచి..
ఓవైపు కనెక్షన్లు పెంచినట్లుగా గొప్పులు చెప్పిన కేంద్రం, మెల్లమెల్లగా సిలిండర్ల ధరలు పెంచుతూ వచ్చిం ది. ఎల్పీజీకి అలవాటు చేసి ప్రజలు అటువైపు మొగ్గు చూపుతున్న తరుణంలో ధరలతో బాదడం మొదలు పె ట్టింది. సిలిండర్ రేటు క్రమంగా పెంచడమేకాదు.. సబ్సిడీ పూర్తిగా ఎత్తివేసి భారం ప్రజలపై మోపుతున్నది. గ్యాస్ వినియోగానికి అలవాటు పడిన ప్రజలు.. రేట్లు పెంచినా భరిస్తారన్నా ధీమాతో కేంద్రం వ్యవహరిస్తున్నది. నిజానికి కేంద్రం ఇటీవల వంటగ్యాస్ సిలిండర్పై 50, వాణిజ్య సిలిండర్పై 354 పెంచిన విషయం తెలిసిందే. 2014 మార్చిలో ఇదే సిలిండర్ ధర 410 ఉండేది. కాగా, తొమ్మిదేళ్ల బీజేపీ ప్రభుత్వ హయాంలో ఒక్కో సిలిండర్పై 765 వరకు పెంచి ప్రస్తుతం 1175కు తెచ్చింది. ఉమ్మడి జిల్లాలో 7.90 లక్షల పైచిలుకు గ్యాస్ కనెక్షన్లుంటే.. అందులో 1.19 లక్షలకుపైగా ఉజ్వల పథకం కింద ఇచ్చిన కనెక్షన్లే ఉన్నాయి. అయితే గతంలో ప్రతి కనెక్షన్పైనా సబ్సిడీ ఇచ్చే వారు. తద్వారా వినియోగదారులకు కొంత ఊరట ఉండేది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఓవైపు రెట్లు పెంచిన బీజేపీ సర్కారు, మరోవైపు సబ్సిడీ పూర్తిగా ఎత్తేసింది. దీంతో మొత్తం భారం వినియోగదారులే మోయాల్సి వస్తున్నది.
ధరలు తగ్గించాల్సిందే
ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అత్యధికంగా ఇవ్వడం వల్లే ప్రపంచంలోనే అత్యధికంగా ఎల్పీజీ వి నియోగంలో భారత్ నంబర్వన్ స్థానంలో నిలి చిందంటూ కేంద్రం పదే పదే చెబుతున్నది. మరోవైపు ధరల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తున్నదనే విమర్శలు న్నాయి. ఈ ధరల వల్ల ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో చాలా కుటుంబాలు కట్టెల పొయ్యివైపు మళ్లుతున్నా యి. ఫలితంగా పర్యావరణం కాలుష్యం కావడమే కాదు, అటవీ సంపద తగ్గిపోయే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు. కేంద్రం చేతులు దులుపుకొనే ముందు, అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ప్రజల సంక్షేమాన్ని ఆలోచించాల్సిన అవసరమున్నది. ప్రతి కుటుంబం వినియోగించే గ్యాస్ ధరలు పెంచడమే కాకుండా, గతంలో మాదిరిగా సబ్సిడీ ఇవ్వాలన్న డిమాండ్ ప్రజల నుంచి వ్యక్తమవుతున్నది.