ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే అధిష్టానమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం పట్టణంలోని వార్డు నంబర్ 12 న్యూహౌసింగ్బోర్డులో రూ.1.60కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు, నాలాల డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇక్కడ అభివృద్ధి చేయాలంటే ఢిల్లీ నాయకులవైపు చూడాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. కాని తమ పార్టీ పేదప్రజలకు సేవచేసేందుకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదన్నారు. మున్సిపాలిటీలోని 49వార్డుల అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నామన్నారు.
న్యూహౌసింగ్ బోర్డులో రూ.5 కోట్లతో ఓపెన్జిమ్, బీటీరోడ్లు, డ్రైనేజీలు, సీసీరోడ్ల సమస్యలన్నింటిని పరిష్కరించామన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చిందని, కేవలం డబుల్బెడ్రూం ఇళ్లహామీ మాత్రమే మిగిలిందన్నారు. మరో 20ఏళ్లు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందన్నారు. అనంతరం కాలనీ వాసులు ఎమ్మెల్యేను, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్ జాదవ్ పవన్నాయక్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, కాలనీవాసులు తిరుమలేశ్, శ్రీకాంత్, వినోద్ రెడ్డి, విజయ్రావ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.