నిర్మల్ టౌన్, జనవరి 23 : జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంతో పాటు మహిళా సంఘాలకు ప్రభుత్వం అందించే బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీనిధి రుణాలు నిర్దేశించిన లక్ష్యాన్ని మార్చి 31లోగా పూర్తి చేయాలని డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. డీఆర్డీవో కార్యాలయంలో బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు, ఉపాధిహామీ, జాబ్కార్డు కలిగిన వారికి ఆధార్లింక్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్చి 31 లోగా ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోరుణపరిమితి లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఏపీడీ గోవింద్రావు, సిబ్బంది ఉన్నారు.
వంద శాతం నమోదు చేయాలి
నిర్మల్ చైన్గేట్, జనవరి,23: లక్పతి దీదీ ఆప్లో వంద శాతం నమోదు లక్ష్యాన్ని ఈ నెల 31 లోగా పూర్తి చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కే విజయలక్ష్మి అన్నారు. నిర్మల్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి, తీసుకున్న రుణాలు, జీవనోపాధి వివరాలను ఆయా సంఘాల వారీగా ఆప్లో నమోదు చేయాలని సూచించారు. మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి చేపట్టే పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో డీపీఎంలు జ్ఞాను, రాజేశ్వర్, సాయిప్రసాద్, విజయలక్ష్మి, శోభారాణి, ఏపీఎంలు సిబ్బంది పాల్గొన్నారు.
కూలీల్లో వెలుగులు నింపేందుకే ఉన్నతి
సారంగాపూర్, జనవరి 23: ఉపాధి హామీ ద్వారా వంద రోజులు పని పూర్తి చేసిన వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే ఉన్నతి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. మండలంలోని హన్మాన్తండాలో సోమవారం ఉన్నతి పథకం శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఉపాధిహామీలో వంద రోజులు పూర్తి చేసిన 18 నుంచి 45 ఏళ్లలోపు నిరుద్యోగులకు ఉన్నతి పథకం ద్వారా వాహనాలు, సెల్ఫోన్లు, ఫొటోగ్రఫీ, హౌస్వైరింగ్, కంప్యూటర్ హార్డ్వేర్, ప్లంబింగ్, ఎలక్రిక్ మోటర్ వైడింగ్, కుట్టుమిషన్, క్యాస్టూమ్ జువెల్లరీ, బ్యూటీ పార్లర్, పేయింటింగ్, బ్యాగుల తయారీ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నుట్ల తెలిపారు.
శిక్షణ కాలంలో రోజుకు రూ. 257 స్కాలర్షిప్తో పాటు భోజన వసతి కల్పించనున్నట్లు వివరించారు. నిరుద్యోగ యువతీయువకులు ఉన్నతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఇందులో సర్పంచ్ రాజేశ్ పవార్, ఎంపీడీవో సరోజ, డీపీఎం వెంకటసాయిప్రసాద్, ఏపీవో లక్ష్మారెడ్డి, సీసీ సునీత, కార్యదర్శి రాజేందర్, ఈజీఎంఎం సిబ్బంది శివకుమార్, సౌమ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.