రాష్ట్ర సర్కారు రైతుల పక్షాన నిలుస్తున్నది. అన్నదాతలకు రైతుబంధు, రైతుబీమా వంటి మహత్తర పథకాలు అమలు చేస్తూనే మద్దతు ధర కూడా కల్పిస్తున్నది. మొన్నటికీ మొన్న శనగలను గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తామని ప్రకటించింది. తాజాగా.. జొన్న రైతుల గోసను గ్రహించిన సీఎం కేసీఆర్ పంట ఉత్పత్తులను రూ.2,970 మద్దతు ధరకు కొనాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో 37 వేల ఎకరాల్లో జొన్న సాగవుతుండగా.. 5.50 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. జిల్లావ్యాప్తంగా ఆదిలాబాద్, జైనథ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బోథ్ మార్కెట్ యార్డుల్లో మార్క్ఫెడ్ ద్వారా పంట ఉత్పత్తులను సేకరించనున్నారు. దిగుబడుల కొనుగోళ్లపై ప్రకటనరావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్, మే 14(నమస్తే తెలంగాణ) ః ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితి ఉండగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా వ్యవసాయం పండుగలా మారింది. సర్కారు అందిస్తున్న సాయంతో రైతులు రెండు పంటలు వేస్తూ సంతోషంగా ఉంటున్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం వారు కష్టపడి సాగు చేసిన పంటలకు దళారులకు విక్రయించి నష్టపోకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పంటలను మద్దతు ధరతో సేకరిస్తున్నది. గతేడాది ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వానకాలంలో సాగు చేసిన పత్తి, కంది, సోయాను కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలను కూడా తీసుకుంటున్నది. ఈ సీజన్లో శనగ పంట ఉత్పత్తులను సేకరిస్తుండగా.. తాజాగా జొన్న పంటనూ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఆదిలాబాద్ జిల్లాలో 37 వేల ఎకరాల్లో జొన్న సాగవుతుండగా.. 5.50 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. మార్క్ఫెడ్ ద్వారా ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులను సేకరించనున్నది.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రైతులు యాసంగిలో జొన్న పంటను అధికంగా సాగు చేస్తారు. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా 37 వేల ఎకరాల్లో వేశారు. వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ఎకరాకు 15 క్వింటాళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది మద్దతు ధర క్వింటాలుకు రూ.2,970 ప్రకటించగా.. ప్రైవేటు వ్యాపారు క్వింటాలకు రూ.2,400తో కొనుగోలు చేస్తున్నా రు. రైతులు పంటను బహిరంగ మార్కెట్లో విక్రయించి నష్టపోకుండా చర్యలు తీసుకున్నది. జిల్లాలో జొన్న పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఆదిలాబాద్, జైనథ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బోథ్ మార్కెట్ యార్డుల్లో మార్క్ఫెడ్ ద్వారా పంట ఉత్పత్తులను సేకరించనున్నారు. డిసెంబర్, జనవరి మాసాల్లో వేసిన పంటను రైతులు కోస్తున్నారు. ఆ పనులు పూర్తయిన వారు ట్రాక్టర్, హార్వెస్టర్ల సాయంతో నూర్పిడి చేయించి అమ్మకానికి సిద్ధం చేశారు. క్రాప్ బుకింగ్ విధానంలో అధికారులు కొనుగోలు చేయనున్నారు. దీంతో సేకరణ పారదర్శకంగా జరగనుంది. అసలైన రైతులు మాత్రమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో జొన్నలను విక్రయించే అవకాశం ఉంది.
బోథ్, మే 14 : ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలుకు ముందుకు రావడం హర్షణీయం. బయటి మార్కెట్తో పోలిస్తే క్వింటాలుకు రూ.1000 లాభం చేకూరనుంది. పంట చేతికొస్తున్నందున త్వరలోనే కొనుగోళ్లు మొదలు పెడితే బాగుంటుంది.
– జక్క అవినాష్రెడ్డి, రైతు, ధన్నూర్(బీ)
బోథ్, మే 14 : నాలుగెకరాల్లో జొన్న సాగు చేశా. ప్రస్తుతం కోత పూర్తయి నూర్పిడి చేయిం చా. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పెట్టుబడి ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు అయ్యింది. ప్రస్తుతం బయటి మార్కెట్తో పోలిస్తే ప్రభుత్వం కొనుగోలుకు ముందు రావడంతో పంట లాభదాయకంగా మారనుంది. ఎకరాకు రూ.15 వేలు లాభం వచ్చే అవకాశం ఉంది.
– రాంబత్తుల లక్ష్మణ్, రైతు, ధన్నూర్(బీ)