రాష్ట్రవ్యాప్తంగా అన్ని బడుల్లో అమలు చేసే యోచనలో విద్యాశాఖ
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. కార్పొరేట్ స్కూల్స్కు తగ్గకుండా ‘మన ఊరు-మన బడి’ కింద బడుల రూపురేఖలు మార్చింది. ఉచితంగా యూనిఫామ్స్, షూస్, పుస్తకాలు అందించడంతోపాటు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నది. మారుమూల ప్రాంతాల్లో డ్రాపౌట్స్ తగ్గడానికి, విద్యార్థులు బడులకు క్రమంగా రావడానికి ఉపయోగపడుతున్నాయి.
కాగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిడ్ డే మీల్స్ స్కిమ్లో వినూత్న పంథాకు మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కొత్తూర్పల్లి ప్రాథమిక పాఠశాల వేదికైంది. గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటడంతో గోబర్ గ్యాస్ ద్వారా వంట చేస్తూ ఆరోగ్యకరమైన భోజనం అందిస్తున్నది. స్కూల్లో గోబర్ గ్యాస్ ఏంటీ? ఎలా సాధ్యమైంది? అని ఆరా తీస్తే దాని వెనుక మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ ప్రత్యేక చొరవ ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
– మంచిర్యాల, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కొత్తూర్పల్లి సర్కారు బడిలో పిల్లలందరికీ ఆరోగ్యకరమైన ఆహారం
మంచిర్యాల, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం అడ్డగోలు గ్యాస్ ధరలు పెంచడంతో సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసే వంట మనుషులకు భారంగా మారింది. ఈ మధ్యే రాష్ట్ర ప్రభుత్వం వంట మనుషులకు ఇస్తున్న మొత్తాన్ని పెంచినా గ్యాస్ కష్టం మాత్రం తీరలేదు. అందుకే సహజ సిద్ధంగా గోబర్ గ్యాస్ ద్వారా వంట చేయిస్తే ఇబ్బంది ఉండదనే ఆలోచన అదనపు కలెక్టర్ రాహుల్కు వచ్చింది. అనుకున్నదే తడువుగా మూగజీవాలు ఎక్కువ ఉండే కొత్తూర్పల్లి ప్రాథమిక పాఠశాలను ఎంచుకున్నారు.
ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.50 వేలతో గ్రామ పంచాయతీ, విద్యాశాఖ అధికారుల సహకారంతో స్కూల్లోనే గోబర్ గ్యాస్ ప్లాంట్ను నిర్మించారు. పంచాయతీ ట్రాక్టర్లో పశువుల వ్యర్థాలు (పేడ)ను సేకరించి ప్లాంట్ను నింపించారు. వంట మనిషి ఇంటి దగ్గర ఆవులు ఉండడంతో రోజు ఆమె రెండు తట్టల పేడ తీసుకొచ్చి ప్లాంట్లో వేస్తున్నారు. దీంతో నిరంతరాయంగా గోబర్ గ్యాస్ వస్తున్నది. నిర్వహణ కూడా చాలా సులభంగా ఉంది. స్కూల్లోని 32 మంది పిల్లలతోపాటు, అదే బిల్డింగ్లో నడుస్తున్న అంగన్వాడీలోని మరో 12 మంది పిల్లలకు సరిపడా వంట చేసేందుకు ఇది ఉపయోగపడుతున్నది.
మంచిర్యాల జిల్లాలోని 90 పాఠశాలల్లో..
కొత్తూర్పల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రయోగాత్మకంగా చేపట్టిన గోబర్ గ్యాస్ ప్లాంట్ విజయవంతం కావడంతో మంచిర్యాల జిల్లాలోని మరో 90 ప్రాథమిక పాఠశాలలకు వీటిని విస్తరించాలని అదనపు కలెక్టర్ రాహుల్ విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇప్పటికే హాజీపూర్ మండలం దొనబండ, రాపల్లి, ముల్కల్లలోని ఎంపీపీఎస్లు, పడ్తనపల్లి, నంనూర్ యూపీఎస్ల్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో చేసే ప్రాజెక్ట్ విజయవంతమైతే రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. కేవలం రూ.50 వేల ఖర్చుతో ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద పనులు చేసుకునే అవకాశం ఉండడంతో చాలా గ్రామాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నదని అధికారులు చెబుతున్నారు.
తొలి విడుతలో మండలానికి రెండు
కొత్తూర్పల్లి ప్లాంట్ సక్సెస్ అయింది. మంచిర్యాల జిల్లాలో మరో 90 పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఎన్ఆర్ఈజీఎస్లో గోబర్-ధన్ కార్యక్రమం కింద గోబర్ గ్యాస్ ప్లాంట్స్ నిర్మించేందుకు మండలానికి రెండు చొప్పున 32 ప్రాథమిక పాఠశాలలను గుర్తించాం. ఇప్పటికే మరో ఐదు పాఠశాలల్లో పనులు మొదలయ్యాయి. ఎల్పీజీ సిలిండర్ల కంటే తక్కువ ఖర్చు అవుతుండడం, ప్లాంట్ ఏర్పాటుకు రూ.50 వేలు మాత్రమే కావడం కలిసొచ్చే అంశాలు. అనంతరం రోజు కొంచెం పశువ్యర్థాలు(పేడ) వేస్తూ వెళ్తే చాలు. ఇవీ ఎకో-ప్రెండ్లీ ప్లాంట్స్. ఎల్పీజీ గ్యాస్పై చేసే వంటల కంటే ఇది వంద శాతం ఆరోగ్యకరం.
– బీ రాహుల్, అదనపు కలెక్టర్, మంచిర్యాల
రూ.1500 మిగులుతాయి
గ్యాస్కు ధర ఎక్కువైంది. అంతకుముందు మస్తు ఇబ్బంది అవుతుండే. రెండు నెలల క్రితం ఈ గోబర్ గ్యాస్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి నెలకు రూ.1500 గ్యాస్ భారం తగ్గింది. ఇందుకు సహకరించిన గ్రామ పంచాయతీకి, అధికారులకు కృతజ్ఞతలు. రోజు ఉదయం రెండు తట్టల పేడ వేసుకుంటే సరిపోతుంది. ఎల్పీజీతో పోలిస్తే త్వరగా వంట అవుతుంది. గోబర్ గ్యాస్ కట్టించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
– లచ్చవ్వ, వంట మనిషి.