మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి ఉపాధిని మెరుగుపర్చడానికి పలు పథకాలను అమలు చేస్తున్నది. స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) సభ్యులకు స్త్రీనిధి ద్వారా రుణాలు అందిస్తున్నది. వీటితోపాటు వారు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని దుకాణాలు ఏర్పాటు చేసి ఉపాధి పొందుతున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శాఖల పరిధిలో పనిచేసే మండల సమాఖ్యలకు కూడా ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తున్నది. ఇందులో భాగంగా ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలతో మండలాల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 13 ఏర్పాటు చేయగా.. రైతులు, మహిళా సంఘాల సభ్యులకు వ్యవసాయ పరికరాలు తక్కువ కిరాయికి లభిస్తున్నాయి.
– ఆదిలాబాద్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తున్నది. డబుల్ బెడ్ రూం ఇండ్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య మహిళ పథకాలు ఉన్నాయి. మహిళల రక్షణ కోసం షీ టీంలను ఏర్పాటు చేసింది. అలాగే మహిళల ఉపాధి మెరుగు పర్చడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత అందిస్తున్నది. స్త్రీనిధి ద్వారా రుణాలు ఇస్తూ ఉపాధి మెరుగుపరుస్తున్నది. మహిళా సంఘాలకు బ్యాంకుల నుంచి రుణాలు లభిస్తుండడంతో పలు రకాల వ్యాపారులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. మహిళా సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధించడానికి అధికారులు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారు.
ఇందులో భాగంగా ప్రతి మండల సమాఖ్యకు వ్యవసాయ అద్దె పరికరాల కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 17 మండలాలు ఉండగా.. ఇప్పటికే 13 మండలాల్లో కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ప్రతి కేంద్రంలో ట్రాక్టర్, ట్రాలీ, నాగళ్లు, ఇతర వ్యవసాయ పరికరాలు అందుబాటులో పెట్టారు. మండల సమాఖ్య నిధులతోపాటు ప్రభుత్వం అందించే డబ్బులతో కేంద్రాలు ప్రారంభించారు. ట్రాక్టర్కు రూ.7.45 లక్షలు, నాగళ్లు, ఇతర పరికరాలు రూ.2 లక్షలు, ట్రాలీ రూ.1.90 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ కేంద్రాల ద్వారా రైతులు, మహిళా సంఘాల సభ్యులకు వ్యవసాయ పరికరాలు అద్దెకు తక్కువ ధరలో లభ్యమవుతాయి. వ్యవసాయ సీజన్లో ట్రాక్టర్లకు బాగా డిమాండ్ ఉంటుంది. రైతులు ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ ధర చెల్లించి తీసుకొచ్చుకుంటారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు పంపిణీ చేయడంతో వారు స్థానికంగా తక్కువ ధరతో ట్రాక్టర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
రైతులకు ప్రయోజనం
మండల సమాఖ్యల ద్వారా వ్యవసాయ అద్దె పరికరాల కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కేంద్రంలో రైతులతోపాటు మహిళా సంఘాల సభ్యులు వ్యవసాయ పనులు చేసుకునేందుకు ట్రాక్టర్ను అద్దెకు తీసుకునే అవకాశం ఉంటుంది. బయట కంటే తక్కువ ధరకు లభిస్తాయి. రైతులు తైవాన్ స్ప్రే, స్ప్రింక్లర్లనూ కిరాయికి తీసుకునే అవకాశం ఉంది.
– స్వామి, ఏపీఎం, డీఆర్డీవో, తలమడుగు
ట్రాక్టర్లతో సమాఖ్యకు ఆదాయం
మండల మహిళా సమాఖ్య నుంచి మేము రూ.10 లక్షల దాకా వెచ్చించి ట్రాక్టర్ కొనుగోలు చేశాం. ఇప్పుడు ఈ ట్రాక్టర్ను అవసరమైన రైతులకు చేండ్ల పనులకు కిరాయిలకు ఇస్తం. మా ఎంఎంఎస్ల వీవో సంఘాలతోని మాట్లాడి ట్రాక్టర్ డ్రైవర్ను పెడుతున్నం. అట్ల కూడా గ్రామంలో నిరుద్యోగికి మేము పని ఇచ్చిన వారమవుతున్నం. ఆ ఆదాయాన్ని సుకా సాలుకు మూడు, నాలుగు సార్లు లెక్కలు చూస్తం. మా మండలంల ప్రతి గ్రామంల ఉన్న పొదుపు సంఘాల మహిళా రైతులకు పైల ప్రాధాన్యం ఇస్తం. మహిళా సంఘాలకు సర్కారు సాయం మంచిగనే ఉన్నది.
– కే రమాదేవి, ఎంఎంఎస్ అధ్యక్షురాలు, భీంపూర్
ట్రాక్టర్ల అవసరం పెరిగింది
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి పనులతోటి, సర్కారు వ్యవసాయ పథకాలతోటి ఇప్పుడు ట్రాక్టర్ల అవసరం పెరిగింది. మా తాంసి వెన్నెలమ్మ ఎంఎంఎస్ల చర్చించి గిట్ల ఒక ట్రాక్టర్ కొన్నం. దీన్ని వ్యవసాయ పనులకు, అవసరమైతే మార్కెట్కు పంటల రవాణాకు ఉపయోగిస్తం. ఎస్హెచ్జీ సభ్యులతో ఉన్న రైతులకు కూడా ఈ ట్రాక్టర్తోని లాభమున్నది. భవిష్యత్ల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో గ్రామాల్లో బాగా నడుస్తున్న పొదుపు సంఘాలతోని సామూహిక వ్యవసాయం కోసం ఆలోచన ఉన్నది. మహిళా సమాఖ్య ప్రగతికి సర్కారు సహకారం మంచిగున్నది.
– ఎర్రం కవిత, అధ్యక్షురాలు, వెన్నెలమ్మ మండల మహిళా సమాఖ్య, తాంసి