ఇచ్చోడ, జనవరి 14 : పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో చదువు చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ పాఠశాలను ప్రారంభించింది. ఆరు నుంచి పదో తరగతి, ఇంటర్మీడియేట్ వరకు అనుభవం గల ఉపాధ్యాయులతో విద్యా బోధన చేస్తున్నది. ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నది. దీంతో మోడల్ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు.
జిల్లాలో మొత్తం ఆరు మోడల్ స్కూళ్లలో 2119 మంది బాలురు, 1894మంది బాలికలు.. మొత్తంగా 4013 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏటా ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో 100 సీట్లు భర్తీ చేస్తున్నారు.ఇందు కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియేట్ కోసం పదో తరగతిలో వచ్చిన గ్రేడ్ పాయింట్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నారు.ఆరో తరగతిలో అడ్మిషన్ల కోసం ఈనెల 9న ప్రవేశాల షెడ్యూల్ విడుదల కాగా, ఈనెల 10 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఏప్రిల్ 16న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మే 15న ఫలితాలు వెల్లడించనున్నారు. మోడల్ స్కూళ్లలో ఆరో తరగతితోపాటు 7నుంచి పదో తరగతి వరకు ఏప్రిల్ 16న ప్రవేశ పరీక్ష ఉంటుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆరో తరగతి విద్యార్థులకు 16న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మే 15న పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. మే చివరి వారంలో సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశాలు కల్పిస్తారు.
ఆదిలాబాద్: బజార్ హత్నూర్,ఆదిలాబాద్, గుడి హత్నూర్,జైనథ్,బోథ్,నార్నూర్
మంచిర్యాల: దండేపల్లి మండలంలోని లింగపూర్,కోటపల్లి,కాసిపెట్,మంచిర్యాల్,మందమర్రి
కుమ్రం భీం ఆసిఫాబాద్ : సిర్పూర్,ఆసిఫాబాద్
నిర్మల్: కుంటాల
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. పేద విద్యార్థులకు ఇది మంచి అవకాశం. ఆదర్శ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉండడంతో నాణ్యమైన విద్య అందుతుంది. విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రణీత, ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి