రెబ్బెన, ఫిబ్రవరి 5 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామ శివారులో కొలువైన శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. లక్షకు పైగా భక్తులు తరలిరాగా, ఆ ప్రాంతం కిటకిటలాడింది. గంటల తరబడి క్యూ కట్టి స్వామి వారిని దర్శించుకున్నారు. గోవిందుడి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎస్పీ సురేశ్కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారిని సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు. రెబ్బెన వ్యాపారులు ఏర్పాటు చేసిన అన్నదానం ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా కొనసాగింది. సాయంత్రం రథోత్సవం కనుల పండువగా సాగగా, భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు తనయులు వినీత్, అంకిత్, జడ్పీ చైర్పర్సన్ కుమారుడు కోవ సాయినాథ్ స్వామి వారిని దర్శించు కున్నారు. జాతరలో 18 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టారు.