‘అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడుత ‘కంటి వెలుగు’ కార్యక్రమం రేపటి(బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. మసకబారిన కండ్లలో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా.. కంటి సమస్యలు ఉండి, ఆర్థిక స్థోమతలేని వారికి వరంగా మారనుంది. మొదటి విడుత కార్యక్రమం విజయవంతం కాగా.. రెండో విడుత దిగ్విజయంగా చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కంటి సమస్యలు ఉన్న వారికి వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు, కండ్లద్దాలు అందించనున్నారు. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేస్తారు. జనవరి 18 నుంచి ప్రారంభం కానుండగా.. వంద రోజులపాటు కొనసాగనున్నది. ఇందులో ఇప్పటికే వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వగా.. ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు కానున్నారు. ప్రతి అంశాన్ని యాప్లో నమోదు చేయనున్నారు. కాగా.. ట్రయల్ రన్ విజయవంతం కాగా.. సోన్ మండలంలో ఏర్పాట్లను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పరిశీలించారు.
ఆదిలాబాద్/నిర్మల్, జనవరి 16(నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రెండో విడుత ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. కంటి సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించడానికి వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కూడా ఇచ్చారు. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆప్తాల్మజిస్టులు, కంటి వైద్యులు, పర్యవేక్షక సిబ్బంది సభ్యులుగా ఉన్నారు. వైద్య శిబిరానికి వచ్చే వారి ఆధార్, సెల్ నంబర్లతో పాటు పూర్తి వివరాలను కంటివెలుగు పోర్టల్లో పొందు పర్చేలా శిక్షణనిచ్చారు. నమోదు చేసేందుకు అవసరమై కొత్త ట్యాబ్లు జిల్లాకు చేరుకున్నాయి. బృందం సభ్యులకు కూడా అందజేశారు. ట్యాబ్ల నిర్వహణలో అవసరమైన సాంకేతిక అంశాలతోపాటు రోగులకు అందించే చికిత్స విషయాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.వీరందరూ కూడా ముందుగా ఇంటింటికీ వెళ్లి కంటి సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తిస్తారు. కాగా.. ఈ సారి కంటి వెలుగు కార్యక్రమాన్ని జనవరి 18న ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆసిఫాబాద్లో 30-40 రోజుల్లో, ఆదిలాబాద్ జిల్లాలో మూడు నెలల్లో, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 100 రోజుల్లోపు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. మొదటగా గ్రామాలు, పట్టణాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు.
కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయనున్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్లు, ఎంపీటీసీలు.. మండల స్థాయిలో జడ్పీటీసీలు, ఎంపీపీల సహకారం తీసుకోనున్నారు. దీనికోసం ప్రజాప్రతినిధులతో వైద్యశాఖ అధికారులు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన మందులు ఇస్తారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ను బట్టి నెల రోజుల్లో అద్దాలు అందిస్తారు. ఆశ, ఆరోగ్య కార్యకర్తలు ఇంటివద్దనే కంటి అద్దాలను అప్పగిస్తారు. అవసరమైన వారికి శ్రస్త్రచికిత్సలు చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారు.
జిల్లా జనాభా 7,08,967 ఉండగా.. 5,31,725 మందికి పరీక్షలు చేయనున్నారు. దాదాపు 75 శాతం మందికి కంటి వెలుగులో భాగంగా పరీక్షలు నిర్వహించనున్నారు. అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. 33 బృందాలు ఏర్పాటు చేయగా.. 27 టీంలు గ్రామీణ ప్రాంతాల్లో, ఆరు బృందాలు పట్టణాల్లో శిబిరాలు నిర్వహిస్తాయి. మూడు టీంలు అత్యవసర సమయాల్లో సేవలు అందిస్తాయి. పరీక్షలు చేయడానికి 33 యంత్రాలు అవసరం కాగా.. 15 అందుబాటులో ఉన్నాయి. మిగతా 18 తాజాగా జిల్లాకు చేరుకున్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్లతోపాటు 165 మంది సిబ్బందిని నియమించారు. వీరికి వైద్యశాఖ అధికారులు శిక్షణ కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి వైద్యశాఖ అధికారులను నియమించారు. గతేడాది మొదటి విడుతలో భాగంగా 2018 ఆగస్టు నుంచి 2019 ఫిబ్రవరి వరకు కంటి వెలుగు నిర్వహించారు. 3,49,340 మందికి పరీక్షలు చేశారు. ఇందులో 1,58,032 పురుషులు, 1,91,308 మహిళలు ఉన్నారు.
జిల్లాలో కాగజ్నగర్ మున్సిపాలిటీ ఉండగా.. 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రెండో విడుతలో దాదాపు 3 లక్షల మందికి పరీక్షలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 22 యంత్రాలు అందుబాటులో ఉండగా.. 25 బృందాలు పరీక్షలు నిర్వహించనున్నారు. 26 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. కాగా.. మొదటి విడుతలో 2,74,766 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 41,781 మందికి రీడింగ్ గ్లాసెస్, 19,677 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు ఇచ్చారు. 13,877 మందికి కంటి శస్త్రచికిత్సల కోసం చర్యలు తీసుకున్నారు.
జిల్లావ్యాప్తంగా కంటి సమస్యలున్న వారిని గుర్తించేందుకు 32 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆప్తాల్మజిస్టులు, కంటి వైద్యులు, పర్యవేక్షక సిబ్బంది సభ్యులుగా ఉన్నారు. ఈ టీంలు రోజూ ముందుగానే నిర్దేశించుకున్న గ్రామాలకు వెళ్లి కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించనున్నారు. తొలి విడుతలో 3,75,859 మందికి పరీక్షలు నిర్వహించారు. దగ్గరి చూపుతో 62,342 మంది, దూరపు చూపుతో 53,919 మంది బాధపడుతున్నట్లు గుర్తించారు. 29,234 మందికి క్యాటరాక్ట్ (మోతెబిందు) సర్జరీలు అవసరమున్నట్లు తేల్చారు.
జిల్లా వ్యాప్తంగా 40 బృందాలను ఏర్పాటు చేశారు. 311 గ్రామపంచాయతీల్లో, ఏడు మున్సిపల్ వార్డుల్లో 100 రోజుల పని దినాల్లో శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ 40, పీఎంవోవోఎస్(పారమెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్) 40, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 40, సూపర్ వైజర్లు 40, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలకు శిక్షణ తరగతులు పూర్తయ్యాయి. వీరందరికి కంటి వెలుగు పరీక్షలు ఎలా నిర్వహించాలి, ఏఆర్ మిషన్పై పరీక్షలు నిర్వహించే పద్ధతులను నెల రోజులపాటు జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. 40 యంత్రాలతో పరీక్షలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి మున్సిపల్ పరిధిలో 13, గ్రామపంచాయతీలో 27 బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు.
ఎదులాపురం, జనవరి16 : కంటి వెలుగు వైద్య శిబిరం ట్రయల్ రన్ సక్సెస్ అయిందని అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వైటీసీ కేంద్రంలో శాంతినగర్ పీహెచ్సీ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు. డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్తో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. కంటి వెలుగు పరీక్షలకు ఏర్పాటు చేసిన టేబుల్స్ ప్రకారం పేర్లు నమోదు చేసుకొని ఏఆర్ యంత్రంలో కంటి పరీక్ష చేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 19న జిల్లా వ్యాప్తంగా ప్రారంభయ్యే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో 468 గ్రామపంచాయతీలు, 49 మున్సిపల్ వార్డుల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో 27, పట్టణ ప్రాంతాల్లో 6 బృందాలను ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. లోపాలను గుర్తించి అవసరమైన వారికి మందులు, కళ్లజోళ్లు అందించాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని, నిర్ణీత సమయానికి వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు అందుబాటులో ఉండి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. డీఆర్డీఏ కిషన్, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, మున్సిపల్ కమిషనర్ శైలజ, ప్రత్యేకాధికారులు డాక్టర్.వైశాలి, జే. లింగేశ్, మెడికల్ ఆఫీసర్ సోహెల్, సీవో రాజారెడ్డి, ఏఎన్ఎం ఉన్నారు.