అదిలాబాద్ : ఉన్నత ఆశయ సాధనకు పేదరికం ఎప్పుడు అడ్డు రాదని..కృషి, పట్టుదలే ఉన్నత లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడ్పడుతాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం బాబు సాటే జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మొదట మహనీయులు అంబేద్కర్, కుమ్రం భీమ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఉన్నతమైన లక్ష్యాలకు పేదరికం ఎప్పుడూ అడ్డు రాదన్నారు. అన్న బాబు సాటే పేద కుటుంబంలో జన్మించినప్పటికి ఆయన చేసిన కృషి, పట్టుదల సమాజ మార్పుకు శ్రీకారం చుట్టిందన్నారు.
దళిత వర్గాల చైతన్యంతో పాటు బీద మధ్యతరగతి కుటుంబాలలో స్ఫూర్తిని నింపుతూ తన రచనల ద్వారా ఎంతో మార్పుని తీసుకొచ్చారన్నారు. విద్యతోనే మార్పు సాధ్యమని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ జెయిర్ రంజని, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కోవా రవి, వెంకటేష్, కాంబ్లే, ముఖిత్ తదితరులు పాల్గొన్నారు.