ఎదులాపురం : ప్రజాస్వామ్యంలో యువత పాత్ర కీలకమైందని ,వివిధ పోటీలలో యువత పాల్గొనడంతో పాటు ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో యువ ఓటర్ పండుగ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వారి పేర్లను ఓటర్గా నమోదు చేసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో వివిధ పోటీలను నిర్వహిస్తూ చైతన్య పరిచే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే రెండు మాసాల్లో జిల్లాలోని యువత సృజనాత్మకంగా, ఆలోచనాత్మకంగా ఉండి సమస్యల సాధకులుగా మారాలని సూచించారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో పండుగ వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాను ఓటర్ జాబితాలో వంద శాతం నమోదు చేయడంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఎన్. నటరాజ్ మాట్లాడుతూ.. వచ్చే మూడు మాసాల్లో ఓటర్ జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు, నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. ఓటర్ జాబితాలను తయారు చేయడానికి అన్ని అంశాలలో శిక్షణ ,అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్టినేటర్ సత్యనారాయణ, ప్రభుత్వ డిగ్రీ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ రహత్ ఖానం తదితరులు మాట్లాడారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు, వెంకటేశ్వర సంగీత నాట్య కళానిలయం విద్యార్థులు నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు పాటల రూపంలో ఓటర్ నమోదుపై వివరించారు.
అనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు, మెమొంటోలను కలెక్టర్ అందజేశారు. కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చిన రెండు సంవత్సరాల సుదీక్షను కలెక్టర్ ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జాడీ రాజేశ్వర్, తాసీల్దార్ భోజన్న, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా తదితరులు పాల్గొన్నారు.