మంచిర్యాలటౌన్, మార్చి 3: మంచిర్యాల పట్టణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. కేసీఆర్ సర్కారు ప్రతి మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్లు నిర్మించాలని తలపెట్టి నిధులను సైతం మంజూరు చేసింది. ఈ మేరకు మంచిర్యాల పట్టణ నడిబొడ్డున ఉన్న ఐబీలో ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఆవరణలో స్థలాన్ని కేటాయించి పనులు ప్రారంభించారు. ఇప్పటికే రూ. 2.93కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఫిల్లర్లు, రెండతస్థుల్లో స్లాబులు, ఇతర పనులు పూర్తయ్యాయి. పూర్తి స్థాయిలో భవనం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావాలంటే మరో రూ. 6.6 కోట్లు అవసరం ఉంది. గోదావరి ఒడ్డున ఉన్న మాతాశిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్ )ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్న ప్రదేశంలోనే నిర్మించాలని, ఇప్పటివరకు నిర్మించిన మార్కెట్ భవనాన్ని రద్దు చేయాలని కోరుతూ మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిస్తున్నది. వర్షాకాలంలో ఎంసీహెచ్ మునిగిపోతున్నదని, ఈ హాస్పిటల్ను సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని, అందుకు అనువైన ప్రాంతం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్న ప్రాంతమేనని ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు సూచించడంతో కౌన్సిలర్లు తీర్మానించారు. దీంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న మార్కెట్లు సరిపోకపోవడం, కొందరు రోడ్లపైనే విక్రయాలు సాగిస్తుండడం, పార్కింగ్ స్థలాలు లేక ట్రాఫిక్ ఇబ్బందులు వస్తుండడంతో వీటన్నంటికీ శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి కేసీఆర్ సర్కారు ప్రణాళికలు రూపొందించింది. పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన, పరిశుభ్రమైన మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. ప్రతి మున్సిపాలిటీకి ఒకటి చొప్పున అధునాతన భవనాలను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు అన్ని రకాలుగా ఉపయోగపడేలా ఈ మార్కెట్ను నిర్మించేలా డిజైన్లను రూపొందించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో కూరగాయలు, మాంసం అమ్మకాలు అధికంగా రోడ్లపైనే సాగుతున్నాయి. మార్కెట్లు ఉన్నా తక్కువ స్థలం ఉండడంతో రోడ్లపైనే వ్యాపారాలు సాగిస్తుండడంతో అనునిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
వీటితో పాటు రద్దీగా ఉండే వివిధ ప్రాంతాల్లోనూ పండ్లు, పూల వ్యాపారులు రోడ్లపైనే అమ్మకాలు సాగిస్తుండడంతో సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ సర్కారులోని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించారు. వెంటనే స్థలాలను కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వెజ్, నాన్ వెజ్, పండ్లు, పూలు తదితర వ్యాపారాలన్నీ ఒకే చోట నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. మున్సిపాలిటీ కేంద్రాల్లో రెండు ఎకరాలకు పైగా స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించారు. రూ. 7.20 కోట్లతో నిర్మించే సమీకృత మార్కెట్ భవంలో మొత్తం 142 స్టాళ్లు నిర్మించాలని నిర్ణయించారు. వీటిలో 96 వెజ్ మార్కెట్ స్టాళ్లు, 30 నాన్వెజ్ మార్కెట్ స్టాళ్లు, 18 పండ్లు, పూల స్టాళ్లు, విశాలమైన పార్కింగ్, బయోడైజెస్టర్, ఇంటర్నల్ పాత్వేస్, టాయిలెట్లు ఉండేలా ప్లాన్చేశారు. భూమినుంచి మూడు అడుగుల పైబడి ఎత్తులో ఉండే విధంగా ప్రతి స్టాల్ను నిర్మించాలని నిర్ణయించారు.