అపర భగీరథుడు, దేశ ఉజ్వల భవిష్యత్ ఆశాకిరణం, సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాకు రానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కార్మిక క్షేత్రానికి మూడోసారి వస్తుండడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్ ద్వారా నూతన కలెక్టరేట్కు చేరుకుంటారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, మళ్లీ కలెక్టరేట్కు తిరిగొస్తారు. నూతన కలెక్టరేట్ను ప్రారంభించడంతోపాటు అక్కడే ఏర్పాటు చేసిన చెన్నూర్, పర్ధాన్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్స్ ను, మెడికల్ కాలేజీ, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ లకు శంకుస్థాపన చేస్తారు. మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జి నిర్మాణానికి కొబ్బరికాయ కొడతారు. అనంతరం బహిరంగ సభకు చేరుకొంటారు. కాగా.. సీఎం రాక సందర్భంగా కలెక్టరేట్ను విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. బహిరంగ సభకు లక్ష మందికిపైగా తరలిరానుండడంతో కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాట్లు చేశారు. రహదారులు, కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేయగా.. మంచిర్యాట పట్టణం గులాబీమయమైంది. 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంచిర్యాల, జూన్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు(శుక్రవారం) మంచిర్యాల జిల్లాకు రానున్నారు. సీఎం హోదాలో మూడోసారి జిల్లాకు వస్తుండడంతో అధికారులు, నాయకులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశారు. ఆర్అండ్బీ అధికారులతోపాటు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, వందలాది మంది కూలీలు పనులు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్ ద్వారా నూతన కలెక్టరేట్ ప్రాంగణంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రూ.60 లక్షలతో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి ప్రారంభిస్తారు. పార్టీ జెండాను ఆవిష్కరించి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ను కుర్చీలో కూర్చొబెడతారు. అక్కడి నుంచి తిరిగి కలెక్టరేట్కు చేరుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ)ని ప్రారంభిస్తారు. అక్కడే రూ.1,748 కోట్లతో చెన్నూర్, పర్ధాన్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు, రూ.510 కోట్లతో మెడికల్ కాలేజీ, రూ.500 కోట్లతో మందమర్రి దగ్గర ఏర్పాటు చేయనున్న ఆయిల్ పాం ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేస్తారు. గోదావరిపై రూ.164 కోట్లతో నిర్మించే మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జికి కొబ్బరికాయ కొడతారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అక్కడ గృహలక్ష్మి, కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం, గొల్ల, కురుమలకు రెండో విడుత గొర్రెల పంపిణీ పథకాలను ప్రారంభిస్తారు.
సీఎం కేసీఆర్ ప్రారంభించే నూతన కలెక్టరేట్ భవనాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుద్దీపాలతోపాటు కలెక్టర్ చాంబర్, మీటింగ్ హాల్, సీఎం కేసీఆర్ పూజలు నిర్వహించే హాల్స్ను ప్రత్యేక పూలతో అలంకరించారు. గురువారం ఉదయం నుంచే సుందరీకరణ పనులు చేపట్టారు. రెండు లారీల్లో పూలను తెప్పించి పనులు చేస్తున్నారు. అన్ని శాఖల ముఖ్య అధికారుల పర్యవేక్షణలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం ప్రాంగణమంతా కలియదిరిగి పరిశీలించనున్నారు. అనంతరం కలెక్టర్ను ఆయన చాంబర్లో స్వయంగా కూర్చొబెట్టి తొలి ఫైల్పై సంతకం చేయించనున్నారు.
కేసీఆర్ పర్యటనను విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. సీఎంకు కనీవినీ ఎరుగనిరీతిలో స్వాగతం పలికేలా సన్నాహాలు మొదలు పెట్టా రు. ముఖ్యంగా బహిరంగ సభకు లక్ష మందికి పైగా సమీకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. చెన్నూర్ నుంచి దాదాపు 65 వేల మందిని తరలించేందుకు బాల్క సుమన్ దగ్గరుండి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మంచిర్యాల నుంచి 40వేల మంది సభకు తరలించేలా స్థానిక ఎమ్మెల్యే దివాకర్రావు చర్యలు తీసుకుంటున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి 20వేల మందిని సభకు తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే చిన్నయ్య రంగం సిద్ధం చేశారు. 30ఎకరాల్లో భారీ సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. భూమికి ఎనిమిది ఫీట్ల ఎత్తులో పెద్ద సభా వేదిక ఏర్పా టు చేశారు. వచ్చే ప్రజలు సీఎం కేసీఆర్ ప్రసంగం చూసేలా ప్రాంగణంలో 12 ఎల్ఈడీలు పెట్టించారు. లైటింగ్ పనులతోపాటు సభ ప్రాంగణాన్ని చదును చేయడం, బారీకేడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు.
సీఎం పర్యటనకు మంచిర్యాల జిల్లా కేంద్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాన కూడళ్లతోపాటు, కలెక్టరేట్కు వెళ్లే దారి పొడవునా భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. ముఖ్య కూడళ్లలో గులాబీ రంగు ఆర్చీలు పెట్టగా.. ఐబీ చౌరస్తా మొదలు లక్ష్మీ థియేటర్ వరకు పట్టణమంతా గులాబీమయమైంది. ఐబీ నుంచి నస్పూర్ వెళ్లే దారి పొడవునా గులాబీ జెండాలు ఏర్పాటు చేశారు. కొత్త కలెక్టరేట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని ముస్తాబు చేశారు. కొత్త బీటీ రోడ్డు వేయడంతోపాటు గులాబీ జెండాలతో ఆ ప్రాంతాన్ని నింపేస్తున్నారు.
సీఎం కేసీఆర్ పర్యటన కోసం పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. కొత్త కలెక్టరేట్ భవనంతోపాటు, బీఆర్ఎస్ కార్యాలయ భవనాన్ని, బహిరంగ సభాస్థలాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబ్, డాగ్ స్కాడ్లు తనిఖీలు మొదలు పెట్టాయి. 24 గంటల ముందు చేసే అతి కీలకమైన టెస్ట్ కూడా పూర్తయ్యింది. సీఎం బందోబస్తు కోసం 2,500 మంది పోలీసులు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నారు. ఐదుగురు ఎస్సీలు, 21 మంది అడిషనల్ ఎస్సీలు/డీఎస్పీలు, 62 మంది సీఐలు, 8 మంది ఉమెన్ సీఐలు, ఎస్సైలు, 183 మంది ఎస్సైలు, 282 మంది హెడ్ కానిస్టెబుల్స్/ఏఎస్సైలు, 116 మంది ఉమెన్ ఏఎస్సై, కాన్సిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్, 234 మంది హోంగార్డులు, 201 స్పెషల్ పార్టీలుసహా కానిస్టేబుల్స్ బందోబస్తును పర్యవేక్షించనున్నారు.
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు నేడు పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. గోదావరిఖని, చెన్నూర్ వైపు నుంచి వచ్చే వాహనదారులు శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ దగ్గర ఉన్న నేషనల్ హైవే ైప్లెఓవర్ మీదుగా క్యాతనపల్లి గాంధారి వనం నుంచి మంచిర్యాల వైపు వెళ్లాలి. మంచిర్యాల నుంచి శ్రీరాంపూర్, చెన్నూర్, గోదావరిఖని వైపు వెళ్లే వాహనదారులు క్యాతనపల్లి గాంధారి వనం దగ్గరున్న నేషనల్ హైవే ఫ్లైఓవర్ నుంచి శ్రీరాంపూర్ జీఎం ఆఫీసు దగ్గరి నుంచి వెళ్లాలి.