నార్నూర్, మే 4 : వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ కాలినడకన వెళ్లారు. అక్కడి పరిస్థితులను చూసి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు. నార్నూర్ మండలంలోని సుంగపూర్, చోర్గావ్ గ్రామాల్లో గురువారం కలెక్టర్ పర్యటించారు. దీంతో గిరిజనులు వాయిద్యాల మధ్య కలెక్టర్కు ఘన స్వాగతం పలికారు. హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. గిరిజనులతో కలిసి రెండు కిలో మీటర్లు కాలిడనకన వెళ్లి తాగునీటి బావిని పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చేసిన గ్రామసభలో పలు సమస్యలపై గ్రామస్తులు కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆర్డబ్ల్యూఎస్, మిషన్భగీరథ అధికారులకు సూచించారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని ప్రతి పల్లెలో మిషన్భగీరథ నీరు ప్రతిరోజూ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామస్తుల వినతి మేరకు ఊరి పొలిమేరలో ఉన్న బావి నుంచి పైపులైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని మిషన్భగీరథ, ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. తర్వాత చోర్గావ్ గ్రామంలో దిశ మోడల్ పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలో మౌళిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈయన వెంట తహసీల్దార్ ఆర్కా మోతీరాం, ఎంపీడీవో కావల రమేశ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారి డీ శ్రీనివాస్, సర్పంచ్ జాదవ్ జీజాబాయి, ఆయాశాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.