తాండూర్, మే 7: నా పేరు గట్టయ్య, నా భార్య పేరు రాజేశ్వరి. మాది తాండూర్ మండలం చౌటపల్లి గ్రామం. మాకు ఇద్దరు కొడుకులు తిరుపతి, కార్తీక్ ఉన్నరు. పెద్ద కుమారుడు పీజీ చేసిండు. ప్రైవేట్ స్కూల్లో చదువు చెబుతూ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయితండు. చిన్నోడు డిగ్రీ చదివి పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుండు. మాకు మునుపు గొర్రెలుండేటివి. గవ్విటిని సాదుకునేటోళ్లం. కొన్ని చనిపోయినయ్. మళ్లా కొత్తగా కొందామంటే చిల్లిగవ్వ లేకుంటైంది. ఇగ ఆయిన్ని గొర్లను అమ్ముకున్నం. రోజూ కూలీ పని చేసుకుంట బతికినం. తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక మా బతుకులకు భరోసానిచ్చిండు. 2017లో మొదటి విడుతలో మాకు గొర్రెల మంద ఇచ్చిన్రు. 20 గొర్రెలు, ఒక పొట్టేలునిచ్చిన్రు. మా పెద్ద కొడుకు తిరుపతికి కూడా 20 గొర్రెలు, పొట్టేలునిచ్చిన్రు.
మేము కొన్ని డబ్బులు కడితే.. మిగతా మొత్తం గవర్నమెంటోళ్లే కట్టి గొర్రెలు కొనిచ్చిన్రు. ఈ ఐదేండ్లలో గవ్వి ఐదింతలైనయ్. మా అవసరాలకు గొర్రెపోతులను అమ్ముకుంటున్నం. ఇద్దరు పిల్లలను చదివిస్తున్నం. ఇప్పుడు మా దగ్గర ఇంకా 122 గొర్రెలు, 20 పిల్లలు ఉన్నయి. వాటికి కావాల్సిన నట్టల మందు, టీకాలను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తోంది. అత్యవసర సమయంలో డాక్టర్ భూమన్న, సిబ్బంది సేవలు అందిస్తున్నరు. ఇగ అట్లనే మాకు రెండెకరాల పడావు పడ్డ భూమి కూడా ఉంది. ఆ రెండెకరాలకు సంవత్సరానికి రూ.20వేల రైతుబంధు కూడా వస్తోంది. గొర్రెల షెడ్డు కోసమని రూ.57 వేలు ఇచ్చిన్రు. గా డబ్బులతో చిన్నపాటి గూన ఇల్లు కూడా కట్టుకున్నం. ఆగమైన బతుకులకు ఇంతకన్నా ఏంగావాలె. సీఎం కేసీఆర్ మా ఇంట్లో పుట్టిపెరిగినట్లే మా కష్టాలు తెలుసుకున్నడు. తండ్రి లెక్క అర్నం ఇచ్చినైట్లెంది. మా బతుక్కి దారి చూపిండు. నాడు చూద్దామంటే నాలుగు పైసలు కనిపించకపోయేటివి. ఇప్పుడు గుండెల మీద చెయ్యేసుకొని దర్జాగా బతుకుతున్నం. కులవృత్తులు జేసుకుని బతికేటోళ్లకు సీఎం సారు మంచి జేస్తున్నడు. గాయన సల్లంగుండాలె.