ఎదులాపురం, నవంబర్ 24 : అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని ఎస్వీఈఈపీ నోడల్ ఆఫీసర్ బీ లక్ష్మణ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన ఓటర్ల అవగాహన సదస్సుకు ఆయన హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 నుంచి 21 సంవత్సరాల వయస్సు గల డిగ్రీ, పీజీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను బీఎల్సీ క్లబ్లను ఏర్పాటు చేసి ఓటరు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్ హెల్ప్లైన్ మొబైల్ యాప్, ఎన్సీఎస్పీ పోర్టల్ లేదా గరుడ యాప్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4వ తేదీల్లో జిల్లాలోని 582 పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పున్నారావు, వైస్ ప్రిన్సిపాల్ విజయ్ గోపాల్, నాయబ్ తహసీల్దార్లు సాయి మహేశ్, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.