చెన్నూర్ నడిబొడ్డున నిర్మించిన కేసీఆర్ పార్కు పట్టణవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రత్యేక చొరవతో రూ.2.50 కోట్లతో సకల సౌకర్యాలతో కట్టించారు. పచ్చికతోపాటు పూల మొక్కలు.. సేద తీరేందుకు గుర్రం, తాబేలు, యాపిల్ ఆకారంలో కుర్చీలు… రెండు పెద్ద పెద్ద బొమ్మల నోటి నుంచి వాటర్ ఫాల్స్ ఆకట్టుకుంటున్నాయి. జారుడు బల్ల, ఉయ్యాలతోపాటు ఆట బొమ్మలు, వస్తువులను ఏర్పాటు చేశారు. వాకింగ్ ట్రాక్లు, జిమ్ అందుబాటులో ఉంచారు. హైదరాబాద్లోని లుంబినీ పార్కు మాదిరిగా మ్యూజికల్ వాటర్ ఫౌంటేయిన్ ఆకట్టుకుంటున్నది. ఉదయం, సాయంత్రం వేళ్లలో పిల్లల నుంచి పెద్దల వరకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
చెన్నూర్, మార్చి 30 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణ నడిబొడ్డున నిర్మించిన కేసీఆర్ పార్కు సందర్శకులకు ఆహ్లాదం.. ఆనందాన్ని పంచుతున్నది. రూ 2.50 కోట్లతో సకల హంగులతో నిర్మించిన పార్కు కట్టి పడేస్తున్నది. హైదరాబాద్ సహా పలు పట్టణాల్లోని పార్కులకు దీటుగా పార్కు నిర్మించారు. ఇటీవల ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో కలిసి ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పార్కును ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. దీంతో రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో భారీ సంఖ్యలో పిల్లలుసహా, పెద్దలు పార్కును సందర్శిస్తున్నారు. పార్కు ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లగానే రెండు పెద్ద సైజులో బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. పచ్చికతోపాటు పూల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. సేద తీరేందుకు గుర్రం, తాబేలు, యాపిల్ ఆకారంలో కుర్చీలు నిర్మించారు. పూరి గుడిసె మాదిరిగా షెడ్లను నిర్మించి కుర్చీలు అందుబాటులో పెట్టారు. రెండు పెద్దపెద్ద బొమ్మలు ఏర్పాటు చేసి, వాటి నోటి నుంచి నీరు పడే విధంగా వాటర్ ఫాల్స్ను నిర్మించారు. హైదరాబాద్లోని లుంబినీ పార్కు మాదిరిగా మ్యూజికల్ వాటర్ ఫౌంటేయిన్ ఆకట్టుకుంటున్నది. పిల్లల కోసం జారుడు బల్ల, ఉయ్యాలతోపాటు ఆట బొమ్మలు, వస్తువులను ఉంచారు. వాకింగ్ చేసుకునేందుకు ట్రాక్లు, వ్యాయామానికి జిమ్ ఏర్పాటు చేశారు. ఇలా అన్ని రకాల వసతులతో పార్కును అందంగా తీర్చిదిద్దడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ఇలా అన్ని వసతులతో పట్టణ నడిబొడ్డున నిర్మించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని కేసీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన మ్యూజికల్ వాటర్ ఫౌంటేయిన్.. హైదరాబాద్లోని లుంబినీ పార్కులో గల ఫౌంటేయిన్ను తలపిస్తున్నది. టౌన్ నడిబొడ్డున రూ.2.50 కోట్లతో కేసీఆర్ పార్కు నిర్మించగా.. ఇందులో రూ.50 లక్షలతో ఫౌంటేయిన్ ఏర్పాటు చేశారు. మ్యూజిక్ చేస్తూ వివిధ రంగులు, ఆకృతుల్లో నీటిని వెదజల్లుతూ ఆహ్లాద పరుస్తున్నది. నిత్యం సాయంత్రం పిల్లలు, పెద్దలు భారీ సంఖ్యలో తరలివచ్చి.. సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడుపుతున్నారు.
చెన్నూర్ పట్టణంలో అన్ని వసతులతో నిర్మించిన కేసీఆర్ పార్కు బాగుంది. హైదరాబాద్తోపాటు ఇతర పట్టణాల్లోని పార్కులకు దీటుగా నిర్మించారు. నేను పిల్లలతో కలిసి తీరిక సమయంలో రిలాక్స్ కోసం వచ్చా. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. సేద తీరేందుకు ఆకర్షణీయంగా కుర్చీలు ఉన్నాయి. పిల్లలు సంతోషంగా పార్కులో ఆడుకుంటున్నారు. పార్కులో తిరుగుతుంటే చాలా ఆనందంగా ఉంది.
– సల్ల ప్రశాంత్, యువకుడు, చెన్నూర్.
బాల్క సుమన్ కృషితో నిర్మాణం
మా చెన్నూర్లో ఇంత మంచి పార్కును నిర్మిస్తారని ఊహించలేదు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పిల్లలు, పెద్దల కోసం పట్టణ నడిబొడ్డున అన్ని వసతులతో పార్కు నిర్మించారు. గతంలో తీరిక సమయాల్లో కాసేపు సేదతీరాలంటే ఎక్కడికి వెళ్లాలో ఆర్థమయ్యేది కాదు. ఇప్పుడు పార్కు నిర్మించడంతో సేద తీరుతున్నాం. పార్కుకు రోజురోజుకూ సందర్శకుల తాకిడి పెరుగుతున్నది.