కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ కంకలమ్మ-కేతేశ్వర జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. తెలంగాణతో పాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు పోటెత్తగా గుట్ట జనసంద్రమైంది. అమ్మవారికి ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. శివసత్తులు.. డప్పు చప్పుళ్ల నడుమ బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
– కౌటాల/చింతలమానేపల్లి, డిసెంబర్ 10
కౌటాల/చింతలమానేపల్లి, డిసెంబర్ 10 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో స్వయంభూ శ్రీ కంకలమ్మ-కేతేశ్వర జాతర.. ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుల్వ కనకయ్య ఆధ్వర్యంలో ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించగా భక్తులు పోటెత్తారు. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
మండల కేంద్రంలోని బస్టాండు ఏరియా నుంచి మొదలుకొని కంకలమ్మ గుట్ట వరకు భక్తజనం కిక్కిరిసింది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి బారులు తీరారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని అల్లుబండ వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ముడుపులు కట్టారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్నదానం చేశారు. దుకాణాల వద్ద సందడి కనిపించింది.
స్వయంభూ అమ్మవారిని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వర్రావు, డీఎస్పీ కరుణాకర్, సీఐలు సాదిక్పాషా, బుద్దే స్వామి, ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, సర్పంచ్ మౌనిష్తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు.
జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వర్రావు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ, ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్సైలతో పాటు 100 మంది సిబ్బంది పాల్గొన్నారు.