ఆదిలాబాద్, జనవరి 25(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కల్యాణలక్ష్మి-షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమంలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందంటూ ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు కలెక్టర్ రాహుల్రాజ్కు ఫిర్యాదు చేశారు. బుధవారం ఆదిలాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాలతోపాటు పట్టణంలోని వార్డుల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్డీవో, స్థానిక తహసీల్దార్, ఇతర అధికారులు హాజరుకాకపోవడంతో ఆయన కలెక్టర్కు ఫోన్ చేసి మండిపడ్డారు. కలెక్టర్ సూచనల మేరకు అధికారులు కార్యక్రమానికి హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఆదిలాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాలు, అర్బన్ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రగడకు దారితీసింది. ప్రొటోకాల్ పాటించలేదం టూ నియోజకర్గంలోని జడ్పీటీసీ, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులమైన తమకు ఎలాంటి సమాచారం లేకుండా అధికారులు కార్యక్రమం నిర్వహించారని సూచించారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
పట్టణ పరిధిలో నిర్వహించిన కార్యక్రమానికి తమకు కనీస సమాచారం లేదని, అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదంటూ మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమ నిర్వహణపై తమకు సమాచారం లేదన్నారు. ప్రజాప్రతినిధులకు తెలియకుండా కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్ చెక్కుల పంపిణీని అధికారులు నిర్వహించారని పేర్కొన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మహిళలను కింద కూర్చొబెట్టి, నాయకులు కుర్చీలపై కూర్చోవడం సమంజసం కాదని వారు సూచించారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వారిలో బేల, మావల, జైనథ్ జడ్పీటీసీలు అక్షిత పవార్, నల్ల వనిత, తుమ్మల అరుంధతి, ఎంపీపీలు దర్శనాల సంగీత, వనిత ఠాక్రే, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ ఉన్నారు.