గణపతి బప్పా మోరియా.. ఆదా లడ్డూ కాలియా.. అంటూ భక్తజనం నీరాజనం పలికారు. నిర్మల్ జిల్లా భైంసా వినాయక నిమజ్జనోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, కోలాటాల నడుమ నిర్వహించిన ర్యాలీలో యువతీయువకులు నృత్యాలతో హోరెత్తించారు. గణేశ్ ప్రతిమలకు గడ్డెన్న వాగులో వినాయకా.. సెలవికా.. అంటూ వీడ్కోలు పలికారు. ముందుగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్ పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణమంతా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
– భైంసా/భైంసా టౌన్, సెప్టెంబర్ 26
భైంసా/ భైంసాటౌన్, సెప్టెంబర్ 26: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథుల విగ్రహాల నిమజ్జనోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, యువకుల నృత్యాల మధ్య శోభాయాత్ర సాగింది. కేరింతలు కొడుతూ, రంగులు చల్లుకుంటూ యువకులు, చిన్నారులు చిందులు వేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టు వద్ద గణనాథులను నిమజ్జనం చేసి వినాయకా.. సెలవికా.. అంటూ వీడ్కోలు పలికారు. నిమజ్జనోత్సవ నేపథ్యంలో భైంసాలో అడుగడుగునా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ ప్రవీణ్ కుమార్ భైంసాలో మకాం వేసి బందోబస్తును పర్యవేక్షించారు. గణేశ్ మండలిల సభ్యులు, యువజన సంఘాల నాయకులు, హిందూవాహిని, కుల సంఘాలు, ఉత్సవ కమిటీ సభ్యులు మంగళహారతులు ఇచ్చి నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించారు. గణేశ్ నగర్లోని మున్నురుకాపు సంఘ భవనంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు విలాస్ గాదేవార్, బబ్రు మహారాజ్, డాక్టర్ నగేశ్, డా. రామకృష్ణ గౌడ్, బీజేపీ నాయకులు రామారావు పటేల్, మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, బీజేపీ నాయకులు మోహన్ రావు పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్ బాబు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణ, నాయకులు రాము, భట్టిగల్లి మున్నురుకాపు సంఘం అధ్యక్షుడు తూమోల్ల దత్తాత్రితో పాటు సభ్యులు, పలువురు ప్రముఖుల ఆధ్వర్యంలో మంగళ హారతులు ఇచ్చి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. భారీ గణేశ్ విగ్రహాలను క్రేన్లతో ట్రాక్టర్లతో ఎక్కించి నిమజ్జనానికి తరలించారు. శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో మహిళలు వినాయకుడికి హారతులు ఇస్తూ, అక్షింతలు చల్లుతూ టెంకాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.
ఆకట్టుకున్న శోభాయాత్ర..
నిమజ్జన శోభాయాత్ర పలువురినీ ఆకట్టుకుంది. బ్యాండు మేళాలు, తాషా వంటి వాటితో యువకులు, మండళ్ల సభ్యులు నృత్యాలు చేశారు. కేరింతలు చేస్తూ హుషారుగా కనిపించారు. శోభాయాత్ర మార్గాల్లో కాషాయజెండాలు రెపరెపలాడాయి. యువత నృత్యాలు చేస్తూ సెల్ఫీల్లో బంధిస్తూ ఆనందంగా గడిపారు. శోభాయాత్రలో పాల్గొన్న యువకులకు గణేశ్ మండలి సభ్యులు, యువజన సంఘాలు, లక్ష్మీనర్సింహ స్వామి యోగా గ్రూప్ సభ్యులు, లింగాయత్, కురుమ సంఘం సభ్యులు, హనుమాన్ చాలీసా సభ్యులు పులిహోర, ఉప్మాను పంచిపెట్టారు. పోలీస్స్టేషన్ సమీపంలో పోలీసులు, పురాణాబజార్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికి మండలిల సభ్యులను సన్మానించారు. మండలి సభ్యులకు జ్ఞాపికలు అందించారు.
లడ్డూ వేలం
పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో లడ్డూ వేలం నిర్వహించగా, వైజీబీ గ్రూప్ రూ.1,24,115 దక్కించుకోగా, కిసాన్ గల్లీకి చెందిన శివాజీ యూత్ సభ్యులు రూ. 30 వేలకు లడ్డూ వేలంలో దక్కించుకున్నారు.