కాసిపేట, మే 5 : ముత్యంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గురువాపూర్ వాగుపై ప్రభుత్వం పీఎంజీఎస్వై పథకం కింద రూ.3.75 కోట్లతో వంతెన నిర్మిస్తున్నది. అలాగే రూ. 3.05 కోట్లతో రేగులగూడ నుంచి గురువాపూర్ మీదుగా చింతగూడ వరకు రహదారి నిర్మిస్తున్నది. మధ్యలో రూ.1.3 కోట్లతో మరో బ్రిడ్జి కూడా కడుతున్నది. గురువాపూర్లో సుమారు 500కుపైగా జనాభా ఉంటుంది. ఇన్నాళ్లూ వాగుపై వంతెన లేక ఆదివాసులు అష్టకష్టాలు పడుతూ వచ్చారు. ఇక వానకాలంలోనైతే వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు.. చిన్నపాటి వర్షానికే వాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయేవి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి నరకం అనుభవించేవారు. అత్యవసర పరిస్థితుల్లో వాగు దాటేందుకు యత్నించి పలువురు ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రత్యేక చొరవతో వంతెనలతో పాటు రహదారి నిర్మాణం దాదాపు పూర్తికావస్తుండగా, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అడవిబిడ్డల కల నెరవేరబోతున్నది. నిధులు మంజూరు చేయించి, తమ బాధలను తీర్చిన మా ఎమ్మెల్యే చిన్నయ్యకు రుణపడి ఉంటామని ఆదివాసులు పేర్కొంటున్నారు.
గురువాపూర్ శివారులోనున్న పంట భూములకు గతంలో పెద్దగా రేటు ఉండేది కాదు. ప్రస్తుతం రహదారి ఏర్పాటుతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. గతంలో ఎకరానికి రూ.5 లక్షల లోపు ఉండగా, ప్రస్తుతం రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలకు వరకు ధర పలుకుతున్నది.
ఇది వరకు మా ఊరికి కనీసం దారి కూడా లేదు. మధ్యలో వాగు ఉంది. వంతెన లేకపోవ డంతో నీళ్లలో నుంచే రాకపోకలు సాగించే టోళ్లం. వర్షాకా లం వాగు ఉప్పొంగి రాకపోకలు బంద్ అయ్యేటివి. మస్తు తిప్పలయ్యేది. వాగుపై బ్రిడ్జి కడితే మా బాధలు పోతయని ఎన్నో ఏండ్లసంది ఎదురు చూసుకుంట వస్తున్నం. గిప్పుడు మా ఎమ్మెల్యే పుణ్యమాని బ్రిడ్జితో పాటు రహదారి కూడా వచ్చింది. ఇగ మాకు రంది లేదు.
– ఆడె మారు, గ్రామ పటేల్, గురువాపూర్
మా ఊరిని పట్టించుకున్నోళ్లు లేరు. వాగుపై వంతెన లేక మస్తు తిప్పలపడుతూ వచ్చినం. ఇప్పుడు మా ఎమ్మెల్యే చిన్నయ్య, సీఎం కేసీఆర్ వల్ల బ్రిడ్జి మంజూరైంది. రహదారి కూడా నిర్మిస్తున్నరు. కొన్ని రోజుల్లో పనులన్నీ పూర్తయితయని సార్లు చెబుతున్రు. ఇగ మా తిప్పలు తప్పినట్లే.
– గెడం గంగు, గురువాపూర్
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో మా సమస్యలకు పరిష్కారం దొరికిం ది. గురువాపూర్ మీదుగా ఆదివాసీ గ్రామాలను కలుపుతూ భారీ రహ దారి నిర్మిస్తున్నారు. గురువాపూర్ వాగుపై వంతెన కూడా కడుతున్నారు. ఇందుకు చాలా ఆనందంగా ఉంది. ఆదివాసీ గిరిజన గ్రామాల్లో రహదారులన్నీ పూర్తి చేసుకున్నాం. నిధులు మంజూరు చేయించిన మా ఎమ్మెల్యేకు కృతజ్ఙతలు.
– బోయిని తిరుపతి, ఉప సర్పంచ్