విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతీ నాలుగో శనివారం నో బ్యాగ్ డేను గత సంవత్సరం ప్రవేశపెట్టింది. ఈ మేరకు ప్రతీ నాలుగో శనివారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్ డేను అమలు చేస్తున్నారు. విద్యార్థులు పుస్తకాల బ్యాగులు లేకుండానే పాఠశాలలకు హాజరు కాగా ఉపాధ్యాయులు ఆటలు ఆడించడం, యోగా చేయించడం, పాటలు పాడించడం, వంటి వి నేర్పిస్తున్నారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.ఆదివారం వచ్చిందంటే పిల్లలకు పండుగ అన్నట్లే.. ఆ రోజున తమదైన స్వేచ్ఛా ప్రపంచంలో రెక్కలొచ్చిన పక్షు ల్లా విహరిస్తారు. నెలలో ఒకరోజైన బడిలో కూడా ఇలాగే ఉంటే… అబ్బ .. ఎంత బాగుంటుందో కదా.. ఈ ఆలోచనకు ఆచరణ రూపమే నో బ్యాగ్ డే.
ఇది గత విద్యా సంవత్సరం నుంచి అమలవుతుంది. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం విద్యార్థులంతా వాటర్ బాటిల్ మాత్రమే తీసుకొని బడికి వస్తున్నారు. బ్యాగుల్లేవ్.. పుస్తకాల్లేవ్.. వచ్చినప్పటి నుంచి ఆటలే.. ఆటలు.. సందడే.. సందడి.. ఉపాధ్యాయులు కూడా పిల్లల్లా మారిపోయి.. వారితో కలిసి ఆడిపాడుతున్నారు. మధ్యమధ్యలో ఎందు కు చదువుకోవాలి..? పెద్దలను ఎలా గౌరవించాలి..? ఏది మంచో, ఏది చెడో ఎలా తెలుసుకోవాలి ? ఇలాంటి విషయా లను ఉపాధ్యాయులు వివరిస్తున్నారు.
పిల్లలపై మానసిక ఒత్తిడిని తగ్గించేలా, మనో వికాసానికి తోడ్పడేలా ప్రతి నాలుగో శనివారం నో బ్యాగ్ డేకు విద్యాశాఖ శ్రీకారం చుట్టిందని మిర్జాపూర్ పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ, అనేక కొత్త కొత్త విషయాలను ఆసక్తికరంగా, ఉత్సాహభరితంగా నేర్చుకోవాలన్నదే ఈ నోబ్యాగ్ డే లక్ష్యమని చెప్పారు. చారిత్రక ప్రదేశాలు, ప్రభు త్వ కార్యాలయాల సందర్శన, నమూనా ఎన్నికల ప్రక్రి య, నమునా అసెంబ్లీ నిర్వహణ తదితరాలను నిర్వహిస్తామని తెలిపారు. పిల్లలే భాగస్వామ్యులుగా జరిగే ఇతర కార్యక్రమాలతో వారిలో ఉత్సా హం కలుగుతుందని, ఆ యా వ్యవస్థలపై అవగాహన పెరుగుతుందని వివరించారు.
విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’ కార్యక్రమాన్ని గత సంవత్సరం ప్రవేశపెట్టి అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. అయితే ఈ నాలుగో శనివారం ఏం చేయాలో, ఏ కార్యకలాపాలు చేపట్టాలో సూచిస్తూ ఎస్సీఈఆర్టీ ప్రత్యేక పుస్తకాన్ని ముద్రించింది. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పుస్తకాల బ్యాగులు లేకుండానే పాఠశాలకు హాజరవుతున్నారు. ఉపాధ్యాయులు ఆటలు ఆడించడం,యోగా చేయించడం, పాటలు పాడించడం వంటివి నేర్పిస్తున్నారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం నో బ్యాగ్డే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. – భైంసా, సెప్టెంబర్ 30