మంచిర్యాల, నవంబర్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల ప్రాంతం. మహారాష్ట్ర పక్కనే ఉన్న నక్సల్స్ కల్లోలిత ప్రాంతమని, వెనుకబాటు తనానికి చిహ్నమని 30 ఏండ్లు పాలించిన కాంగ్రెసోళ్లు, 20 ఏండ్లు పాలించిన టీడీపీ-బీజేపోళ్లు చిన్నచూపు చూశారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి, మంత్రులుగా పనిచేసినా అభివృద్ధిని పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చెన్నూర్కు పట్టిన కటిక చీకట్లను పారద్రోలింది. దశాబ్దాలుగా డిమాండ్గానే ఉన్న చెన్నూర్ రెవెన్యూ డివిజన్ కలను సాకారం చేసింది. రూ.1,658 కోట్లతో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే చెన్నూర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది.
50 ఏండ్లలో పరాయి పాలకులు చేయలేని పనులు, తొమ్మిదిన్నరేళ్లలో చేసి చూపించింది..’ ఒకప్పుడు చెన్నూర్ అంటే పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్నట్లు ఉండేది. కానీ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చెన్నూర్ నియోజకవర్గ దశ-దిశ మారింది. చెన్నూర్ పట్టణంలో రూ.40 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.12 కోట్లతో 50 పడకల దవాఖాన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించారు. గత ప్రభుత్వాల హయాంలో ధర్నాలు, రాస్తారోకోలు చేసిన రాని చెన్నూర్ బస్సు డిపోను పనులను రూ.4 కోట్లతో చేపట్టారు. అన్నింటికీ మించి చెన్నూర్ రెవెన్యూ డివిజన్ అయ్యింది. చెన్నూర్ గోదావరి, ప్రాణహిత నదులపై కోటపల్లి, చెన్నూర్, జైపూర్ మండలాల్లో ఎత్తిపోతల పథకాలను నిర్మించి కాళేశ్వరం బ్యాక్ వాటర్ ద్వారా నియోకవర్గంలో లక్ష పైచిలుకు ఎకరాలకు సాగునీరు ఇచ్చే బృహత్తర చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
చెన్నూర్తోపాటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతుల కోసం మందమర్రిలో 70 ఎకరాల్లో రూ.500 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో 1,200 ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఐదు వేల మంది సింగరేణి ఇండ్లకు పట్టాలు అందజేశారు. దాదాపు 102 గ్రామ పంచాయతీల్లో మహిళ సహకార సంఘాల కోసం ఒక్కో భవనానికి రూ.18 లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న ‘సమ్మక్క-సారలమ్మ’ భవనాలు రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రతి గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
తెలంగాణ ప్రభుత్వం ఒక్క చెన్నూర్ మున్సిపాలిటీలోనే సుమారు రూ.207.11 కోట్ల పైచిలుకు, మందమర్రి మున్సిపాలిటీలో రూ.256.40 కోట్లు, క్యాతన్పల్లి మున్సిపాలిటీలో రూ.247.01 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టింది. చెన్నూర్లో రూ.25 కోట్లతో జలాల్ పెట్రోల్ బంక్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు పెద్ద చెరువు నుంచి బుద్దారం రోడ్డు వరకు నిర్మించిన బైపాస్ పట్టణానికి మణిహారంగా మారింది. రూ.21.02 కోట్లతో 400 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
మందమర్రి మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో సుమారు రూ.25 కోట్ల అంతర్గత రోడ్లు, కాలువల నిర్మాణాలు జరుగుతున్నాయి. రూ.29.68 కోట్లతో 560 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఒక్క ఇళ్లు కూడా నేలమట్టం కాకూడదనే సదుద్దేశంతో రూ.27.05 కోట్లతో నిర్మిస్తున్న మందమర్రి ఆర్వోబీ పనులు పురోగతిలో ఉన్నాయి. క్యాతన్పల్లిలో రూ.35 కోట్లతో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ఇక్కడ కూడా రూ.15.15 కోట్లతో 286 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది.
మున్సిపాలిటీ పరిధిలో దాదాపు రూ.20 కోట్లతో అంతర్గత రోడ్లు, కాలువల పనులు జరుగుతున్నారు. చెన్నూర్లో 18 వార్డులు, మందమర్రిలో 24, క్యాతన్పల్లిలో 22 వార్డుల్లో బతుకమ్మ ప్లే గ్రౌండ్లు ఏర్పాటు చేశారు. మూడు మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నారు. ఒక్కో దానికి రూ.7.20 కోట్ల ఖర్చు చేస్తున్నారు. చెన్నూర్లో రూ.17.52 కోట్లతో 7,629 ఇండ్లకు, మందమర్రిలో రూ.40 కోట్లతో సుమారు 4 వేల ఇండ్లకు, క్యాతన్పల్లిలో రూ.22 కోట్లతో 11,328 ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఇవీ కాకుండా ఏడు నుంచి పదికిపైగా కేసీఆర్ మల్టీ పర్సస్ కన్వెన్షన్ హాల్స్, రూ.50 కోట్లతో కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్, మినీ ట్యాంక్ బండ్ల అభివృద్ధి, వైకుంఠధామాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇలా ఎన్నో పనులు చేశారు.
చెన్నూర్ అంటే గుర్తుకొచ్చేది వర్షాకాలంలో వాగులు, వంకలు ఉప్పొంగడంతో నీటి మయమైన గ్రామాలే. ఒకప్పుడు వర్షాకాలం వచ్చిందంటే కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి, ఊళ్లకు ఊళ్లు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వాగులు, వంకలపై 18 బ్రిడ్జిలు కట్టించింది. కోటపల్లి మండల ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ తుంతుంగ వాగుపై రూ.8 కోట్ల బ్రిడ్జి నిర్మించింది. దీంతో ఏదులబంధం, సిర్సా, పుల్లగామ, రొయ్యలపల్లి, ఆల్గామా, జనగామ, వెంచపల్లి గ్రామాల దశాబ్దాల కష్టాలు తొలిగిపోయాయి.
ఇలా చెన్నూర్ మండలంలోని రూ.10 కోట్లతో సుద్దాల వాగు, రూ.350 కోట్లతో కిష్టంపేట, రూ.4.80 కోట్లతో సుబ్బరాంపల్లి, రూ.1.97 కోట్లతో గంగారం బ్రిడ్జి, రూ.3.86 కోట్లతో బొక్కల గుట్ట బ్రిడ్జిలను నిర్మించింది. ఒక్క కోటపల్లి మండలంలోనే రూ.25.94 కోట్లతో తొమ్మిది బ్రిడ్జిలను మంజూరు చేయించింది. ఇవే కాకుండా మరెన్నో బ్రిడ్జి కమ్ చెక్డ్యామ్ల నిర్మాణానికి ఇప్పటికే అనుమతులు తీసుకొని పెట్టింది. ఇవేకాకుండా అనేక మారుమాల గ్రామాల్లోనూ అంతర్గత రోడ్లు, కల్వర్టులు నిర్మించింది. అనేక గ్రామాల్లో డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలను ఏర్పాటు చేయించింది. ఇదంతా గడిచిన ఎనిమిదిన్నరేళ్లలోనే చేసి, చెన్నూర్ గడ్డపై చెరగని ప్రగతి ముద్ర వేసింది తెలంగాణ సర్కారు.