నిర్మల్ అర్బన్, జనవరి 22 : పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఫలితాలు, 100 శాతం ఉత్తీర్ణతతో నిలిచేందుకు కృషి చేస్తున్నారు. అందుకోసం విద్యార్థులకు అనుగుణంగా ప్రత్యేక శ్రద్ధ చూపుతూ విద్యాశాఖ అధికారులు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో చదివిని విద్యార్థులు ఎంబీబీఎస్, ఇంజినీరింగ్, ఐఐటీ తదితర విద్యాసంస్థలో అనేక సీట్లు సాధించి తమ సత్తా చాటుతూ కార్పొరేట్ విద్యార్థుల సరసన నిలుస్తున్నారు. గతేడాది పది పరీక్ష ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలువగా, గతేడాదికి దీటుగా పది ఫలితాల్లో ప్రథమ స్థానంలో ఉంచేందుకు విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందుకోసం విద్యార్థులను పది పరీక్షలకు ఇప్పటికే సన్నద్ధం చేశారు.
నిర్మల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు మొత్తం 9,075 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభ్తుత పాఠశాలల నుంచి 312, ఎంపీపీ, జడ్పీ పాఠశాలల నుంచి 3,355 మంది, కేజీబీవీల నుంచి 690 మంది, మైనార్టీ వెల్ఫేర్ నుంచి 238 మంది, మహాత్మా జ్యోతిబాఫూలే నుంచి 440 మంది, ఆదర్శ పాఠశాలల నుంచి 105 మంది, సోషల్ వెల్ఫేర్ నుంచి 387 మంది, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి 102 మంది, టీఎస్ఆర్ఈఐ సొసైటీ నుంచి 79 మంది, ఆశ్రమ పాఠశాలల నుంచి 416, (మొత్తం ప్రభుత్వ పాఠశాలల నుంచి 6,124), ప్రైవేట్ ఎయిడెడ్ నుంచి 48 మంది, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల నుంచి 2,903 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. విద్యార్థుల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరిలోని విద్యార్థులను క్లెవర్ విద్యార్థులుగా, బీ కేటగిరికి చెందిన వారు మీడియం విద్యార్థులుగా, సీ కేటగిరికి చెందిన విద్యార్థులను వెనుకబడిన విద్యార్థులుగా విభజించారు. వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు మరింత శ్రద్ధపెట్టి, వారిని ఆయా సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులకకు ఉత్తీర్ణులను చేసే బాధ్యత అప్పగించారు. మీడియం విద్యార్థులు తమ గ్రేడింగ్ మెరుగుపర్చేకునేందుకు మార్కులను పెంచుకునేందుకు కృషి చేయిస్తున్నారు. ఏ కేటగిరీకి చెందిన విద్యార్థులు 10 జీపీఏ మార్కులు సాధించడమే లక్ష్యంగా వారిని సన్నద్ధం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచి, ప్రతీ సబెక్టులో పాస్ అయ్యేలా ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులకు బాధ్యతలను అప్పగించారు. ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు, సాయంత్రం 4:40 గంటల నుంచి 5:45 గంటల వరకు ప్రతీ సబ్జెక్టులో రీడింగ్ పరీక్షలను నిర్వహిస్తూ విద్యార్థులను పది పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. గురువారం నుంచి రివిజన్స్తో పాటు ప్రతి రోజూ పరీక్ష నిర్వహించనున్నారు. అందుకోసం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచనలు అందజేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహణ, 35 రోజుల పాటు, ప్రతిరోజూ పరీక్ష నిర్వహించనున్నారు. వీటితో పాటు రెండు గ్రాండ్ టెస్టులు నిర్వహించి, ఫైనల్ పరీక్ష నిర్వహించి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. చదువులపై విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా వ్యాయామం, యోగా, మెడిటేషన్ చేయిస్తున్నారు. మానసికంగా కూడా వారిని దృఢపరుస్తున్నారు.
మంత్రి చేతుల మీదుగా త్వరలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు, 10 జీపీఏ మార్కులు సాధించేందుకు దోహదపడే స్టడీ మెటీరియల్ను రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి త్వరలో ఉచితంగా పంపిణీ చేయనున్నారు. మంత్రితో పాటు ముథోల్ ఎమెల్యే విఠల్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ వారి నియోజికవర్గాల్లోని విద్యార్థులకు అందించనున్నారు.
విద్యార్థులకు వరుస పరీక్షలు, గ్రాండ్ టెస్టులు నిర్వహించి విద్యార్థులు ఆత్మైస్థెర్యంతో వార్షిక పరీక్షలు రాసేలా సన్నద్ధం చేస్తున్నాం. విద్యార్థులను కేటగిరీల వారీగా విభజించి, ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాం. గతేడాదికి దీటుగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు యోగా, మెడిటేషన్ వంటి ఒత్తిడి నిరోధాకాలను పాఠశాలల్లో అమలు పరుస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తాం. – రవీందర్ రెడ్డి, డీఈవో, నిర్మల్ జిల్లా