నిర్మల్ అర్బన్, ఆగస్టు 16: జిల్లాలో మద్యం దుకాణాలకు వెల్లువలా దరఖాస్తులు వస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని 19 మండలాలు 2 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 47 మద్యం దుకాణాలు ఉన్నాయి. 2021-23 మద్యం టెండర్ల కాలపరిమితి నవంబర్ నెలతో ముగియ నుండగా మూడు నెలల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం 2023-25 కాలపరిమితికి ఈనెల 4 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెల్లువలా దరఖాస్తుల ను సమర్పిస్తున్నారు. జిల్లాలో 47 మద్యం దుకాణాలు ఉండగా, 9 ఎస్సీ, గౌడ్, ఎస్టీ కులాలకు కేటాయించారు. మిగతా 38 షాపులకు ఎవరైన దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో దుకాణానికి ఎన్ని దరఖాస్తులైనా సమర్పించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో భారీగా దరఖాస్తులు వస్తున్నాయి.
రేపటితో దరఖాస్తుల సమర్పణకు ఆఖరు..
నిర్మల్ జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు బుధవారం వరకు 108 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో భైంసా ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 18 దుకాణాలకు 29 దరఖాస్తులు రాగా, నిర్మల్ ఎక్సైజ్ పరిధిలో 29 మద్యం దుకాణాలకు 79 దరఖాస్తులు వచ్చాయి. భైంసా ఎక్సైజ్ స్టేషన్ పరిధితో పోలిస్తే నిర్మల్ ఎక్సైజ్ పరిధిలోని మద్యం దుకాణాల కు పోటీ ఎక్కువ ఉంది. ఇక రెండు రోజులే గుడువు ఉండడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు రానున్నాయి. శుక్రవారం చివరి రోజు, లక్ష్మీ వారం కావడంతో ఆరోజు దరఖాస్తులను సమర్పించేందుకు ఇప్పటికే డీడీలను సైతం సిద్ధం చేసుకొని చాలా మంది రెడీగా ఉన్నారు.
రిజర్వు దుకాణాలపై ఆసక్తి
రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్థులకు ప్రత్యేక రిజర్వేషన్ సదుపాయం కల్పించగా, ఈ ఏడాది కూడా యధాతథంగా రిజర్వేషన్లను కొనసాగించింది. ప్రత్యేక రిజర్వేషన్ స్థానాల్లో ఆయా కులాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో 9 దుకాణాలు రిజర్వు కాగా, ఇందులో ఒకటి ఎస్టీ, ఐదు దుకాణాలు ఎస్సీ, మూడు గౌడ్లకు కేటాయించింది. మిగతా దుకాణాలతో పోలిస్తే వీటికి పోటీ తక్కువగా ఉంటుందనే అభిప్రాయంతో పోటాపోటీగా దరఖాస్తు చేస్తున్నారు. మరికొంత మంది ఆయా కులాల వా రిని మచ్చిక చేసుకొని వారితో దరఖాస్తులు వేయిస్తున్నారు. ఒక్కో దుకాణానికి టెండర్ కింద రూ. 2 లక్షల ఫీజు చెల్లిస్తున్నారు.
గత కొన్నేండ్లుగా వచ్చిన దరఖాస్తులు.. ఆదాయం గడువులోగా దరఖాస్తులు సమర్పించాలి..
నిర్మల్ జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు బుధవారం నాటికి 108 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గడువు తేదీని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తులను స్వీకరిస్తాం. బ్యాంకు ఇ బ్బంది, ఆన్లైన్ ఇక్కట్లు, సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నందున ముందుగానే నిర్ణీత సమయంలో దరఖాస్తులను అందజేస్తే బెటర్. చివరి రెండు రోజుల్లో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రానున్న నేపథ్యంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.
-శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిర్మల్