పత్తి రైతుకు పెద్ద కష్టమే వచ్చింది. వర్షాలు అనుకూలించి ఆశించిన స్థాయిలో పంట పండగా, ఏరేందుకు కూలీలు దొరకక చేలల్లోనే రాలిపోతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన తెల్లబంగారం చేతికందకుండా పోయి నష్టపోవాల్సిన దుస్థితి నెలకొనగా, కర్షకుల్లో ఆందోళన కనిపిస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ తిర్యాణి, జనవరి 19 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఏడాది దాదాపు 3.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యింది. వర్షాలు అనుకూలించడంతో అనుకున్న స్థాయిలో పంట పండింది. గతంలో ఎకరానికి ఐదారు క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈ ఏడాది 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు వస్తోంది. మొత్తంగా 10 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటిదాకా సుమారు 6 లక్షల క్వింటాళ్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తున్నది.
మొదట సీసీఐ ద్వారా పత్తి ధర క్వింటాలుకు రూ. 7100 నిర్ణయించగా, ప్రైవేటు వ్యాపారులు రూ. 7000 చెల్లించి కొనుగోలు చేశారు. గత నెల నుంచి పత్తి ధర తగ్గించి రూ. 6500 నుంచి రూ. 6800 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఒకటీ రెండుసార్లు తీసిన పత్తితో పెట్టుబడి ఖర్చులు రాగా, ఇక లాభాలు వస్తాయనుకున్న సమయంలో కూలీల కొరత వెంటాడుతున్నది. ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలోని వేలాది ఎకరాల్లో పత్తి వృథాగా పోతున్నది.
ఉపాధి హామీ పనులు ప్రారంభంకావడంతో పాటు పొరుగు జిల్లాల్లో మిర్చి, పసుపు పంటలను తీసేందుకు కూలీలు తరలివెళ్తుండగా, ఇక్కడ కొరత ఏర్పడింది. పత్తిని ఏరే కూలీలకు మొదట కిలోకు రూ. 6 చొప్పున ఇవ్వగా, ఇప్పుడు కిలోకు రూ. 12 చొప్పున ఇస్తామన్నా రాని పరిస్థితి ఎదురైంది.. ఇక పలుచోైట్లెతే ప్రతి రోజూ రూ. 300 కైకిలి ఇస్తామన్నా వెనుకడుగు వేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్నవారు తమ చేలల్లోని పత్తిని వారే ఏరుకుంటున్నారు. పెద్ద ఎత్తున పత్తిని సాగుచేసిన రైతులు మాత్రం చేసేదేమీ లేక తలలు పట్టుకుంటున్నారు. పత్తి ధర పెరిగినా ఫలితం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. లక్షలాది రూపాయల విలువ చేసే తెల్లబంగారం మట్టిపాలవుతున్నది.