దిలావర్పూర్, డిసెంబర్ 18 : ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో దిలావర్పూర్ మండలం గుట్టల మీది గ్రామమైన మాడెగాం అనుబంధ పంచాయతీ కదిలి ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ స్కూల్ స్థాయిలో తీర్చిదిద్దారు. ఇందుకు పంచాయతీ నిధులు రూ.3.75లక్షలు వెచ్చించారు. సర్పంచ్ సరితరాజు, ఎంపీవో అజీజ్ఖాన్ ఆలోచనతో పంచాయతీ కార్యదర్శి సునీల్కుమార్ కలిసి ఈ బడి కార్పొరేట్ స్కూల్ను తలపించేలా తీర్చిదిద్దారు. విద్యార్థులను ఆకట్టుకునేలా బడి గోడలపై అందమైన బొమ్మలు వేయించారు. మా బడి కార్యక్రమం ద్వారా వచ్చే పాఠాలు వీక్షించేందుకు టీవీ ఏర్పాటు చేశారు. విద్యార్థుల రికార్డులను భద్రపరిచేందుకు గాను అదే పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు రూ.10 వేలతో బీరువా తెచ్చారు. రెండు రోజుల క్రితం రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఈ పాఠశాలను సందర్శించారు. ఈ బడిని అందంగా ముస్తాబు చేయించిన ప్రజాప్రతినిధులు, అధికారులను మంత్రి అల్లోల అభినందించారు.