ఎదులాపురం : కొవిడ్ వల్ల అనాథలైన పేద కుటుంబాలకు స్వచ్ఛంద సంస్థలు అందించిన సహకారం మరువలేనిదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సేల్స్ ఫోర్స్ ఆర్థిక సహకారంతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ద్వారా గురువారం స్థానిక టీటీడీసీలో 15 కుటుంబాలకు వివిధ యూనిట్లను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల పాటు కొవిడ్తో ఎంతో మంది సమస్యలు ఎదుర్కొన్నారని, మరణాలు సంభవించాయని తెలిపారు. జీవనోపాధి కోసం సేల్స్ ఫోర్స్ ఆర్థిక సహాయంతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ద్వారా రూ.7లక్షలతో 15 యూనిట్లను అనాథ కుటుంబాలకు అందించడం అభినందనీ యమన్నారు.
ఇలాంటి కుటుంబాలను స్వచ్ఛందంగా ఆదుకునేందుకు కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. సేవా కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. ఇంటర్మీడియెట్ చదువుల కోసం 8 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ ధ్రువీకరణ పాత్రలను కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డీసీపీవో రాజేంద్రప్రసాద్, సంస్థ అసోసియేట్ సాయికిరణ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.